హైకోర్టులో ఆర్టీసీ సమ్మె సీన్ : కొనసాగుతున్న వాదనలు

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 10వ తేదీ గురువారం కోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం, కార్మిక సంఘాల తరపున న్యాయవాదులు వాదిస్తున్నారు. సమ్మెపై అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేశాయి. సమ్మెపై కార్మిక సంఘాలు వివరణ ఇచ్చాయి. వాదనలు జరుగుతున్న సందర్భంగా హైకోర్టుకు ఆర్టీసీ జేఏసీ నేతలు, టీజేఎస్ నేత కోదండరాం వచ్చారు. కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం మరో ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన ప్రయత్నం కార్మికులు చేయడం లేదని, చాలాసార్లు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగిందని కార్మిక సంఘాల తరపున న్యాయవాది రచనా రెడ్డి వాదించారు. ఇవ్వాల్సిన సబ్సిడీ, రాయితీలు ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగాలకు సంబంధించిన జీత భత్యాలు, ఇతరత్రా వాటిని పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తే..కార్మికులు వెంటనే సమ్మె విరమిస్తారని చెప్పారు.
ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తరపున అడ్వకేట్ వాదించారు. కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి సమయం ఇవ్వాలని కోరినా..వారు వినిపించుకోలేదని కోర్టుకు తెలిపారు. గత నెల 29వ తేదీన సునీల్ శర్మ ఆధ్వర్యంలో కమిటీ నియమించడం జరిగిందని తెలిపారు. కమిటీ నిర్ణయం తీసుకోకముందే..కార్మికులు సమ్మెలోకి వెళ్లారన్నారు. సమ్మెపై హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read More : RTC సమ్మె ఎఫెక్ట్: దసరా సెలవులు పొడిగింపు?