ప్రభాస్కు ఊరట : భూ వివాదానికి హైకోర్టు సూచనలు

సినీ నటుడు ప్రభాస్కు హైకోర్టులో ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా రాయ్దుర్గ్ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి విషయంలో హైకోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం కోర్టు దీనిపై విచారణ జరిపింది. ఆరు దశబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదానికి చెక్ పెట్టేందుకు పలు సూచనలు చేసింది కోర్టు. ప్రభాస్ స్వాధీనంలో ఉన్న భూమి నుండి ఖాళీ చేయించడం చట్ట విరుద్దమని వెల్లడించిన కోర్టు..ఈ విషయంలో ఆ భూమిని ప్రభాస్కు అప్పగించలేమని తెలిపింది. ప్రభుత్వం చట్టం నిర్దేశించిన విధి విధానాల అనుసరించలేదని పేర్కొంది. 1958 నుండి ఇక్కడి భూములపై వివాదం చెలరేగుతోంది.
భూ క్రమబద్దీకరణకు ప్రభాస్ దరఖాస్తు చేసుకుంటే..విస్తృత ప్రజా ప్రజాప్రయోజానలు, ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా దానిని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. తీర్పు కాపీ అందుకున్న 8 వారాల్లో ఆ దరఖాస్తుపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని వెల్లడించింది. ప్రభాస్ పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరిస్తే..తగిన ఆదేశాల నిమిత్తం తిరిగి న్యాయస్థానాన్ని అతను ఆశ్రయించవచ్చునని కోర్టు చెప్పింది.
ఏళ్ల నుండి సుదీర్ఘ భూ వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించినట్టు అవుతుందని ఉద్దేశ్యంతో ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపింది. వందల ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కోరుతున్న మిగిలిన వారు కూడా అదే రీతిలో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంటుందని తెలిపింది. క్రమబద్దీకరణ ఫీజులు చెల్లించడం..భూములను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని హైకోర్టు తెలిపింది.
ఏళ్ల తరబడి ప్రైవేటు వ్యక్తుల స్వాధీనంలో భూములున్నప్పుడు కేవలం కాగితాలపై ఆ భూమి తమ స్వాధీనంలో ఉందని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదంది. రాయ్ దుర్గ్ పన్మక్త గ్రామంలో తనకున్న భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ అధికారులు గేటుకు తాళాలు వేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.