ఇంటర్ జేఏసీ నేత మధుసూదన్‌రెడ్డి అరెస్ట్‌

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 03:34 PM IST
ఇంటర్ జేఏసీ నేత మధుసూదన్‌రెడ్డి అరెస్ట్‌

Updated On : October 4, 2019 / 3:34 PM IST

తెలంగాణ లెక్చరర్స్‌ సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. తన నివాసం నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మధుసూదన్‌రెడ్డిని రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మధుసూదన్‌రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ ఆరోపిస్తోంది.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో మధుసూదన్‌రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు… ఇప్పటి వరకు మూడు కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు గుర్తించారు. హైదరాబాద్‌, వికారాబాద్‌, కర్నూలు సహా.. ఏకకాలంలో పది చోట్ల సోదాలు నిర్వహించారు. బీనామీల పేర్లతో కూడా బెట్టిన ఆస్తులపై ఆరా తీస్తున్నారు. మధుసూదన్‌రెడ్డిపై ఇంటర్‌ ప్రశ్న పత్రాల లీకేజీ సహా పలు ఆరోపణలు ఉన్నాయని ఏసీబీ డీఎస్‌పీ సత్యనారాయణ అన్నారు. 

మధుసూదన్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆయన నివాసంతో పాటు.. బంధువుల ఇళ్లు, కార్యాలయం సహా మొత్తం పది ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వ హించిన అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు… మధుసూదన్‌రెడ్డి ఇంట్లో 50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. మధుసూదన్‌రెడ్డి బినామీగా భావిస్తున్న మహేందర్‌రెడ్డి ఇంట్లోనూ ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. మహేందర్‌రెడ్డి ఇంట్లో భారీగా ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. 52 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, 52 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 16 లక్షల నగదు గుర్తించారు. 

మరోవైపు తన దగ్గర ఒక్కరూపాయి కూడా అక్రమ సొమ్ము లేదంటున్నారు మధుసూదన్‌రెడ్డి. ఎవరో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికీ  బినామీ కాదంటున్న ఆయన… తాను ఎలాంటి అక్రమ కొనుగోళ్లు చేయలేదంటున్నారు.