దసరాకి దారేది : ఆర్టీసీ సమ్మెతో ఆందోళనలో ప్రయాణికులు
దసరా పండుగ వేళ తెలంగాణలో ప్రయాణికులకు పెద్ద సమస్య వచ్చి పడింది. దసరాకి ఇంటికి వెళ్లేది ఎలా అని వర్రీ అవుతున్నారు. ఈసారి ఇంటికి పోలేమా, పండుగను ఆనందంగా

దసరా పండుగ వేళ తెలంగాణలో ప్రయాణికులకు పెద్ద సమస్య వచ్చి పడింది. దసరాకి ఇంటికి వెళ్లేది ఎలా అని వర్రీ అవుతున్నారు. ఈసారి ఇంటికి పోలేమా, పండుగను ఆనందంగా
దసరా పండుగ వేళ తెలంగాణలో ప్రయాణికులకు పెద్ద సమస్య వచ్చి పడింది. దసరాకి ఇంటికి వెళ్లేది ఎలా అని వర్రీ అవుతున్నారు. ఈసారి ఇంటికి పోలేమా, పండుగను ఆనందంగా సెలబ్రేట్ చేసుకోలేమా అని కంగారు పడుతున్నారు. దీనికి కారణం ఆర్టీసీ సమ్మె. ఆర్టీసీలో కార్మిక సంఘాల సమ్మె సైరన్ మోగించాయి. సమ్మెకే మొగ్గు చూపాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో రెండో రోజూ చర్చలు విఫలం అయ్యాయి. అక్టోబర్ 5 నుంచి సమ్మె తప్పదనే సంకేతాలు ఇచ్చారు.
ఓవైపు రెగులర్ రైళ్లలో రిగ్రట్, ప్రత్యేక రైళ్లలో వందల్లో వెయిటింగ్ లిస్టు… ఇప్పుడు ఆర్టీ సమ్మె.. దీంతో పండగ ప్రయాణంపై సందేహాలు నెలకొన్నాయి. దసరాకు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న లక్షలాది మంది ప్రయాణికులు సందిగ్ధంలో పడ్డారు. తెలంగాణలోని కొన్ని ప్రధాన పట్టణాలు మినహా మిగతా అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులే ప్రధానం. ఇంటికి వెళ్లాలంటే బస్సుల్లో వెళ్లడం తప్ప మరో దారి లేదు. అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీలు సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మె అనివార్యమైతే తీవ్ర ఇబ్బందులు తప్పవని ప్రయాణికులు వర్రీ అవుతున్నారు. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని 5వేల ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే రెగ్యులర్ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులూ నడుపుతున్నారు. రెండు రోజులుగా 500 బస్సులు అదనంగా నడిపినట్లు అధికారులు తెలిపారు.
ఆర్టీసీ అంచనా ప్రకారం అక్టోబర్ 3 నుంచి 7వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. నగరం నుంచి తెలంగాణ జిల్లాలు సహా ఏపీలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో పెద్ద ఎత్తున తరలి వెళతారు. సమ్మె అనివార్యమైతే అక్టోబర్ 5 ఉదయం 5గంటల నుంచి ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోతాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నగరం నుంచి ఊళ్లకు వెళ్లడమే కాదు… తిరిగి రావడమూ కష్టమే అవుతుంది. బతుకమ్మ, దసరా తెలంగాణలో ముఖ్యమైన వేడుకలు కావడంతో సిటీ నుంచి 25లక్షల మందికి పైగా ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లనున్నారు. రెండు రోజుల క్రితమే పిల్లలకు సెలవులు ప్రకటించడంతో రద్దీ మొదలైంది. సాధారణంగా ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు 1.5 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తారు. రెండు రోజులుగా 30వేల మంది అదనంగా వెళ్లినట్లు అధికారుల అంచనా.
నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి ప్రతిరోజు 120 ఎక్స్ప్రెస్ రైళ్లు, మరో 100 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఒక్క సికింద్రాబాద్ నుంచి 85 ఎక్స్ప్రెస్లు వివిధ ప్రాంతాలకు నడుస్తాయి. అయితే అన్ని రెగ్యులర్ రైళ్లలోనూ రిగ్రట్ కనిపిస్తోంది. ఇక దసరా, దీపావళి పండగల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల మధ్య 150 సర్వీసులను అదనంగా అందుబాటులోకి తెచ్చారు. కానీ ఈ సర్వీసుల్లోనూ వెయిటింగ్ లిస్టు 150–200 వరకు ఉంది. మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప.. రద్దీని ఎదుర్కోవడం కష్టం.
ఆర్టీసీ కార్మికుల సమ్మె అనివార్యమైతే ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు రవాణాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లేందుకు వివిధ రకాల వాహనాలకు ముఖ్యంగా ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు, ఆటోలు, క్యాబ్ లకు తాత్కాలిక పర్మిట్లను ఇవ్వనున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్ల తాత్కాలిక నియామకానికి అనుమతి ఇచ్చే యోచనలో ఉన్నారు. గ్రేటర్లో నడుస్తున్న 12వేల స్కూల్ బస్సులను ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించేందుకు వినియోగిస్తామంటున్నారు. మరోవైపు ప్రాంతీయ రవాణా కార్యాలయాల వారీగా అందుబాటులో ఉన్న ప్రైవేట్ వాహనాలు, డ్రైవర్లను ఇప్పటి నుంచే అధికారులు సన్నద్ధం చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖ, కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాలు, బెంగళూర్, చెన్నై తదితర దూర ప్రాంతాలకు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ ఏసీ, నాన్ ఏసీ బస్సులపైన సమ్మె ప్రభావం ఇప్పటి నుంచే స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు వీకెండ్, మరోవైపు దసరా సెలవులను దృష్టిలో ఉంచుకొని చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పని చేస్తున్నవారు అక్టోబర్ 5 నుంచి పెద్ద ఎత్తున రాకపోకలు సాగించనున్నారు. అదే రోజు నుంచే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ముందస్తుగా బుక్ చేసుకునేందుకు కూడా ప్రయాణికులు వెనకడుగు వేస్తున్నారు. ఒకవేళ సమ్మె తప్పనిసరైతే ఆర్టీసీనే స్వయంగా బుకింగ్లను నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది.