దసరా నాటికి కేబుల్ బ్రిడ్జి సిధ్ధం

  • Published By: chvmurthy ,Published On : April 20, 2019 / 03:16 AM IST
దసరా నాటికి కేబుల్ బ్రిడ్జి సిధ్ధం

Updated On : April 20, 2019 / 3:16 AM IST

హైదరాబాద్: దేశంలోనే అతిపెద్దదిగా పేర్కొంటున్న దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. జూబ్లీ హిల్స్, మాదాపూర్ లలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు, దుర్గం చెరువు నుంచి గచ్చిబౌలీకి త్వరగా చేరుకునేందుకు నిర్మిస్తున్న ఈ కేబుల్‌ బ్రిడ్జి పనులు 65 శాతం పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఎక్స్‌ట్రా డోస్డ్‌ సాంకేతికత వినియోగిస్తున్నందున చెరువు మధ్యలో పిల్లర్‌ అవసరం లేకపోవడంతో పాటు వంతెనను 75 మీటర్లకు బదులు 57 మీటర్ల ఎత్తులోనే నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌ హ్యాంగింగ్‌ బ్రిడ్జిగానూ ఇది గుర్తింపు పొందనుంది. దసరా నాటికి ఈ కేబుల్‌ స్టే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.  బ్రిడ్జి  పూర్తయితే జూబ్లీహిల్స్‌ నుంచి మైండ్‌స్పేస్, గచ్చిబౌలిలకు దాదాపు 2కి.మీ మేర దూరం తగ్గడంతో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36, మాదాపూర్‌లపై ట్రాఫిక్‌ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. దీని అంచనా వ్యయం రూ.184 కోట్లు కాగా నిర్మాణం పూర్తయితే జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఐకియా స్టోర్‌ వరకు సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం సాధ్యమవుతుంది.రంగురంగుల విద్యుత్ కాంతులతో హైదరాబాద్‌లో మొట్టమొదటి వేలాడే బ్రిడ్జిగా, పర్యాటక కేంద్రంగా మారనున్నది.

రెండు పిల్లర్ల మధ్య వేసే మెయిన్‌ బ్రిడ్జిలో ప్రీకాస్ట్‌ సెగ్మెంట్‌ అలైన్‌మెంట్‌ ప్రక్రియను  ఏప్రిల్ 18 గురువారం విజయవంతంగా పూర్తి చేశారు. 160 మెట్రిక్‌ టన్నుల బరువున్న ఈ భారీ సెగ్మెంట్‌ దేశంలోనే పెద్దది. ఇప్పటివరకు ఇంత బరువైన సెగ్మెంట్‌ను ఎక్కడా వినియోగించలేదు. ఇనార్బిట్‌మాల్‌ సమీపంలోని ప్రీకాస్టింగ్‌ యార్డులో తయారైన ఈ ప్రీకాస్ట్‌ సెగ్మెంట్‌ను తొలుత దుర్గం చెరువు వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత పంటూన్‌ ద్వారా చెరువులోకి తీసుకెళ్లి పైకి లిఫ్ట్‌ చేశారు. ఈ బ్రిడ్జిని మొత్తం 52 సెగ్మెంట్లతో నిర్మించనుండగా దేశీయ సాంకేతికతతోనే ఇంతటి భారీ సెగ్మెంట్‌ను విజయవంతంగా పైకి తీసుకెళ్లారు.

కేబుల్ బ్రిడ్జి ప్రత్యేకతలు 
చెరువుపై ఉండే బ్రిడ్జి స్పాన్‌ 234 మీటర్లు కాగా ఇది దేశంలోనే అతి పొడవైనది. జపాన్‌లో ఇంతకంటే పొడవైన స్పాన్లతో కేబుల్‌ బ్రిడ్జీలు ఉన్నప్పటికీ వాటిల్లో స్టీల్‌ వినియోగించారని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ ఆర్‌.శ్రీధర్‌ తెలిపారు. స్టీల్‌ లేకుండా ఎక్స్‌ట్రా డోస్డ్‌ కేబుల్‌ స్టే ప్రీకాస్ట్‌ కాంక్రీట్‌ బ్రిడ్జిలో మాత్రం ప్రపంచంలోనే ఇది పొడవైనదని పేర్కొన్నారు. ఇంత పొడవైన స్పాన్‌ ఇప్పటి వరకు ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఇక మన దేశానికి వస్తే గుజరాత్‌ బరూచ్‌ జిల్లాలోని 144 మీటర్ల కేబుల్‌ బ్రిడ్జే పెద్దదని ఆయన తెలిపారు. బల్దియా ఆధ్వర్యంలో దుర్గం చెరువుపై నిర్మిస్తున్నఈ కేబుల్ బ్రిడ్జి దానికన్నా నాలుగురెట్లు పొడవైంది కావడంతో ఇది పూర్తయితే దేశంలోనే పొడవైన కేబుల్ బ్రిడ్జిగా మారనున్నది. మెయిన్‌ స్పాన్‌తో పాటు రెండువైపులా బ్యాక్‌ స్పాన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే పొడవు 426 మీటర్లు అవుతుందన్నారు.  మొదటి సెగ్మెంట్‌ అమరిక పనులు మొత్తం ఐదారు రోజుల్లో పూర్తవుతాయని జీహెచ్‌ఎంసీ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ వెంకటరమణ తెలిపారు. ఆ తర్వాత రెండు రోజులకో సెగ్మెంట్‌ చొప్పున పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.