Operation Ganga : క్షేమంగా స్వదేశానికి.. ఢిల్లీ చేరిన ఆరో విమానం.. ఇప్పటివరకు 1,396 మంది భారత్కు చేరిక
Operation Ganga నిర్విరామంగా కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం దాకా యుక్రెయిన్లోని భారతీయులతో 5 విమానాలు భారత్ చేరగా..
Operation Ganga : రష్యా దాడుల కారణంగా యుక్రెయిన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియక స్థానికులు, అక్కడ ఉంటున్న విదేశీయులు ఆందోళన చెందుతున్నారు. అనేకమంది భారతీయులు సైతం యుక్రెయిన్ లో చిక్కుకుపోయారు. యుక్రెయిన్లోని భారతీయుల తరలింపు కోసం భారత ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ గంగ నిర్విరామంగా కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం దాకా యుక్రెయిన్లోని భారతీయులతో 5 విమానాలు భారత్ చేరగా.. కాసేపటి క్రితం ఆరో విమానం కూడా ఢిల్లీ చేరింది.
సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న విమానంలో 240 మంది భారతీయులు ఉన్నారు. వారంతా సురక్షితంగా స్వదేశం చేరుకున్నారు. ఇప్పటిదాకా యుక్రెయిన్ నుంచి సురక్షితంగా భారత్ చేరుకున్న వారి సంఖ్య 1,396కు చేరుకుంది. ఎంబీబీఎస్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు యుక్రెయిన్ నుంచి రొమేనియా సరిహద్దులకు చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి చేరుకుంటున్నారు.
Operation Ganga: ఆపరేషన్ గంగ వేగవంతం.. భారతీయుల తరలింపునకు మరో పది విమానాలు..
యుద్ద పీడిత ఉక్రెయిన్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను తరలించే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఆపరేషన్ గంగా పేరుతో భారతీయ పౌరుల తరలింపు ప్రక్రియన కొనసాగిస్తోంది. తాజాగా నలుగురు కేంద్ర మంత్రులను మోదీ ప్రభుత్వం రంగంలోకి దింపింది. హర్దీప్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, వీకే సింగ్.. భారతీయ పౌరుల తరలింపు మిషన్ను సమన్వయం చేయనున్నారు. ఇందుకోసం వీరు ఉక్రెయిన్ పొరుగు దేశాలకు వెళ్లనున్నారు. ఈ నలుగురు మంత్రులు భారతీయ పౌరుల తరలింపు ప్రక్రియలో పాల్గొననున్నారు. ఈ నిర్ణయంతో యుక్రెయిన్లోని భారతీయులను దేశానికి తరలించే పని మరింత సులువు కానుంది.
రష్యా సైనిక చర్య నేపథ్యంలో యుక్రెయిన్లో వైద్య విద్యార్థులతోపాటు వేల మంది భారతీయులు చిక్కుకున్నారు. వారిని తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలోనే ఎక్కువగా రష్యా సైన్యం దాడులు చేస్తోంది. యూరప్ దేశాల వైపు అంటే పశ్చిమ దిక్కున దాడులు తక్కువ. దీంతో వెస్ట్ ప్రాంతాలకు పాస్పోర్టు తదితర కీలక పత్రాలతో తరలి రావాలని యుక్రెయిన్లో చిక్కుకున్న ఇండియన్స్కు కేంద్రం సూచించింది.
యుక్రెయిన్కు పశ్చిమ సరిహద్దుల నుంచి ఎయిరిండియా విమానాల్లో ఇండియన్స్ను తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఒక్కో విమాన ప్రయాణ ఖర్చు రూ.1.10 కోట్ల పై మాటే. ఆయా విమానాల గడువును బట్టి ఖర్చు కూడా పెరుగుతుంది. ఎయిరిండియా.. రొమేనియా, హంగరీ తదితర ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి డ్రీమ్ లైనర్ అని పిలిచే బోయింగ్ 787 విమానంతో సేవలను అందిస్తుంది. ఇప్పటికే వందల మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారు.
బోయింగ్ 787 చార్టర్డ్ విమానం ఖర్చు గంటకు రూ.7-8 లక్షలు అని పలు ఎయిర్లైన్స్ చెబుతున్నాయి. బుడాపెస్ట్, బుకారెస్ట్ల నుంచి ఢిల్లీ వరకు విమాన ప్రయాణానికి ఆరేడు గంటల టైం పడుతుంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ నివేదిక ప్రకారం బుడాపెస్ట్ నుంచి ముంబైకి విమానం చేరుకోవడానికి దాదాపు 6 గంటల టైం పట్టింది. దీని ప్రకారం ఒక రౌండ్ ట్రిప్ కోసం ఖర్చు రూ.1.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో విమానం ల్యాండింగ్, పార్కింగ్ చార్జీలు, నావిగేషన్ చార్జీలు, ఇంధన ఖర్చు, సిబ్బంది ఖర్చు తదితరాలు కలిసి ఉంటాయి.
ఉక్రెయిన్లోని భారతీయుల తరలింపు కోసం అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తోంది. ఇక ఈ డ్రీమ్లైనర్ విమానంలో 250కి పైగా సీట్లు ఉంటాయి. సగటున గంటకు ఐదు టన్నుల ఇంధనం అవసరం. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ఖర్చు మొత్తం టాటా సన్స్కు కేంద్రం చెల్లించనుందని సమాచారం.