ఎప్పుడైనా, ఏ విధంగానైనా ప్రతిస్పందిస్తాం.. పాక్ ఆర్మీకి ఆ దేశ సర్కారు అనుమతి.. ఏం జరగనుంది?
“యుద్ధ చర్యలే” అని పేర్కొంది. పాకిస్థాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని చెబుతున్న భారత్ వాదనలను పాక్ తిరస్కరించింది.

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన నేషనల్ సెక్యూరిటీ కమిటీ (ఎన్ఎస్సీ) సమావేశం జరిగింది.
భారత దాడులపై అవసరమైతే పాకిస్థాన్ దళాలు ప్రతిస్పందించడానికి అనుమతించింది. ఆత్మక్షణ కోసం, ఎప్పుడైనా, ఏ విధంగానైనా ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని పాకిస్థాన్ చెప్పింది. భారత్ దాడులను పాకిస్థాన్ “బహిరంగంగా దూకుడుతో ప్రదర్శించిన చర్య”గా అభివర్ణించింది.
భారత దాడులు పాక్లోని మహిళలు, పిల్లలు సహా పౌరులకు నష్టం చేకూర్చాయని చెప్పింది. ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరించిందని చెప్పుకొచ్చింది.
పాకిస్థాన్ ఆరోపణలను భారత్ ఖండించింది. తాము తొమ్మిది ఉగ్రవాద సంబంధిత ప్రదేశాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపింది. ఈ దాడులు చాలా జాగ్రత్తగా, పరిమితంగా చేశామని, ఉద్రిక్తతలను పెంచడానికి ఉద్దేశించినవి కాదని చెప్పింది.
పాక్ వాదన సమగ్రంగా..
తనను తాను రక్షించుకునే హక్కు తమకు ఉందని, యూఎన్ చార్టర్ ఆర్టికల్ 51ను ఉదహరిస్తూ పాకిస్థాన్ చెప్పింది. అమాయక పాకిస్థానీలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రతిస్పందించే హక్కు ఉంటుందని తెలిపింది. పాక్ భూభాగంపై భారత్ చేసిన దాడికి ప్రతిస్పందించే హక్కు కూడా ఉందని పేర్కొంది.
పాక్ సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాన్ని భారత్ ఉల్లంఘించిందని పాక్ ఆరోపించింది. భారత్ చర్యలు ప్రపంచ నియమాల ప్రకారం “యుద్ధ చర్యలే” అని పేర్కొంది. పాకిస్థాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని చెబుతున్న భారత్ వాదనలను పాక్ తిరస్కరించింది.
పహల్గాం ఉగ్రవాద దాడిపై నిష్పక్షపాత, తటస్థ దర్యాప్తును జరుపుతామని తాము ముందే ప్రకటన చేశామని పాకిస్థాన్ తెలిపింది. కానీ, అందుకు భారత్ అంగీకరించలేదని చెప్పింది. భారత్ నీలం–జీలం జలవిద్యుత్ ప్రాజెక్టుపై దాడి చేసిందని పాక్ తెలిపింది. ఇది పౌరులను లక్ష్యంగా చేసుకోవడమే అవుతుందని, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని చెప్పుకొచ్చింది.