గిల్గిత్- బాల్టిస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలకు పాక్ నోటిఫికేషన్

పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లోని గిల్గిత్- బాల్టిస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 15న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఇదివరకు వాయిదా పడ్డ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరిస్తూ పాక్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతానికి పూర్థిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరిణామాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
వాస్తవానికి, జూన్- 24న గిల్గిత్- బాల్టిస్థాన్ అసెంబ్లీ గడువు ముగిసింది. ఆగస్టు 24నే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం…. గిల్గిత్- బాల్టిస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 15న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన పాకిస్తాన్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు, పాక్ తీరుపై లడఖ్ ఎంపీ జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్ తీవ్రంగా మండిపడ్డారు. గిల్గిత్- బాల్టిస్థాన్ భారత్లో అంతర్భాగం అని తేల్చిచెప్పారు. అక్కడి ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. పాకిస్థాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్ లో క్రూరమైన మారణహోమం ప్రారంభించేందుకు ఇమ్రాన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు.
పాక్ కు ఎలాంటి హక్కులు లేవన్న భారత్
కాగా, గిల్గిట్-బాల్టిస్థాన్తో పాటు మొత్తం జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు తమ దేశంలో అంతర్భాగమేనని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇవన్నీ భారత్లో అంతర్భాగమని పాకిస్థాన్కు పలుమార్లు వెల్లడించింది. చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించుకున్న ప్రాంతాలపై పాకిస్థాన్కు ఎలాంటి హక్కు లేదని,ఆక్రమించుకున్న అన్ని భూభాగాలను ఖాళీ చేయాలని గత మే నెలలోనే పాక్ కు సూచించింది.
ఇప్పటికే.. సీపెక్ కారిడార్ పీఓకే నుంచి వెళ్తుండడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు పాకిస్థాన్ విడుదల చేసిన రాజకీయ చిత్రపటంపైనా భారత్ వ్యతిరేకత వ్యక్తం చేసింది. గుజరాత్, జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు చెందిన భూభాగాలను పాకిస్థాన్ తనదిగా చూపించడాన్ని భారత్ తప్పుబట్టింది.