Plane crash: కుప్పకూలిన విమానం.. 46 మంది మృతి
పట్టణ ప్రాంతాల్లో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి.

సుడాన్లోని ఓమ్డుర్మాన్ నగరంలో ఓ సైనిక విమానం కూలిపోయి 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సైనిక సిబ్బంది, సుడాన్ పౌరులు ఉన్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
యుక్రెయిన్ కంపెనీకి చెందిన ఆంటోనోవ్ విమానం ఓమ్డుర్మాన్కు ఉత్తరాన ఉన్న వాడి సయ్యద్నా ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియరాలేదు.
మృతదేహాలను ఓమ్డుర్మాన్లోని ఎన్యూ ఆసుపత్రికి తరలించినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. విమాన ప్రమాదంలో గాయపడ్డ మరికొంత మందికి కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. 2023 ఏప్రిల్ నుంచి సుడాన్ అంతర్యుద్ధంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది.
Also Read: బంగారం ధరలు భారీగా పెరుగుతుంటే.. ఇక్కడ మాత్రం పసిడి ధర తక్కువ గురూ.. కొనేస్తారా?
మిలటరీ, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) మధ్య ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ యుద్ధం ఎంతో విధ్వంసానికి దారితీస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఇటీవల రాజధాని ఖార్టూమ్తో పాటు వివిధ ప్రాంతాలలో ఆర్ఎస్ఎఫ్పై సైనికులు పైచేయి సాధించారు.
ఓమ్డుర్మాన్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదం మిలటరీ, ఆర్ఎస్ఎఫ్ మధ్య ఘర్షణల వేళ చోటుచేసుకోవడం గమనార్హం. ఇరుపక్షాలు పరస్పరం ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసుకుంటున్నాయి. సూడాన్ సైన్యం, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఇంకెన్ని పరిణామాలను దారితీస్తుందోనని జనాలు భయపడుతున్నారు.