navneet kaur: మహారాష్ట్రలో ఎంపీ, ఎమ్మెల్యే దంపతుల అరెస్టు
ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంతో మహారాష్ట్రకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే దంపతులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
navneet kaur: ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంతో మహారాష్ట్రకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే దంపతులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అమరావతి ఎంపీగా ఉన్న నవనీత్ కౌర్, బద్నేరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న రవి రాణా భార్యాభర్తలు. ఇద్దరూ ఇండిపెండెంట్లుగా గెలవడం విశేషం. ఈ ఇద్దరికీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు కొంతకాలంగా హనుమాన్ చాలీసా అంశంపై వివాదం నడుస్తోంది. బాంద్రాలోని సీఎం ఉద్ధవ్ నివాసమైన ‘మాతో శ్రీ’ ఎదురుగా ‘హనుమాన్ చాలీసా’ ఆలపిస్తామని నవనీత్-రవి రాణా దంపతులు ఛాలెంజ్ చేశారు.
దీంతో అధికార శివసేనకు చెందిన కార్యకర్తలు వారి ఇంటిపై శనివారం దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే, వీరికి కేంద్రం భద్రత పెంచింది. దాడి ఘటన అనంతరం సీఎం ఉద్ధవ్ థాక్రేను విమర్శిస్తూ తిరిగి నవనీత్ కౌర్ పలు వ్యాఖ్యలు చేశారు. శివసేన గూండాల పార్టీ అని విమర్శించారు. ఈ నేపథ్యంలో నవనీత్-రాణాలపై సెక్షన్ 153ఏ, 35, 37, 135 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిని శనివారం సాయంత్రం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కోర్టు వీరికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, నవనీత్ కౌర్ గతంలో పలు తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా నటించారు.