ముఖ్య‌మంత్రి ద‌త్త‌పుత్రిక పెళ్లి.. కేసీఆర్ కానుక ఏమిటంటే?

ముఖ్య‌మంత్రి ద‌త్త‌పుత్రిక పెళ్లి.. కేసీఆర్ కానుక ఏమిటంటే?

Updated On : December 28, 2020 / 10:04 AM IST

సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష వివాహ వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుడి స్వగ్రామం కేశంపేట మండలం పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో ఇవాళ(28 డిసెంబర్ 2020) ఉదయం 10 గంటలకు ప్రత్యూష, చరణ్‌రెడ్డిల వివాహం జరగబోతుంది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహ మహోత్సవం జరగబోతోంది. ప్రభుత్వ అధికారులతో పాటు వరుడి బంధువులు ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేశారు. ఈ వివాహానికి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఐఏఎస్‌ అధికారులు రఘునందన్‌రావు, మహిళా సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజ్‌, ఐసీడీఎస్‌ ఉన్నత అధికారులు హాజరవుతున్నారు.

వధువు ప్రత్యూష, వరుడు చరణ్‌రెడ్డి బంధువులు, సీఎం సతీమణి పాల్గొని శోభ‌మ్మ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. వరుడు కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామానికి చెందిన ఉడుముల మర్రెడ్డి, జైన్‌మేరీ దంపతుల పెద్దకుమారుడు చరణ్‌రెడ్డితో అక్టోబర్‌లో ప్రత్యూషకు హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరిగింది. చరణ్‌రెడ్డి విదేశాల్లో విద్యను పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రత్యూష కూడా నర్సింగ్ విద్యను పూర్తిచేసి ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో నర్స్‌గా చేస్తున్నారు. చరణ్‌రెడ్డి పూర్తి వివరాలను తెలుసుకున్న రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ అధికారులు, సీఎం కేసీఆర్‌కు వివరించిన తర్వాత వివాహం ఖరారైంది.

హైదరాబాద్‌ నగరంలోని బండ్లగూడకు చెందిన ప్రత్యూష తల్లిదండ్రులు విడిపోగా.. తల్లి 2003లో చనిపోయేముందు ఆస్తిని కూతురు ప్రత్యూష పేరిట రాసింది. తండ్రి ఆమెను పట్టించుకోపోవటంతో బంధువులు సత్యసాయి ఆశ్రమంలో చేర్చించారు. 2013లో ప్రత్యూషకు మైనార్టీ తీరగా.. తండ్రి ఇంటికి తీసుకెళ్లడంతో.. ప్రత్యూష పేరిట ఉన్న ఆస్తిని దక్కించుకునేందుకు సవతితల్లి పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. ఈ క్రమంలో చావు వరకు వెళ్లిన ఆమె కథనం వార్తల్లో నిలవగా.. అప్పుడు సీఎం కేసీఆర్ ఆమెను దత్తత తీసుకుని బాగోగులు చూసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు వివాహం కూడా జరిపిస్తున్నారు.

మమత, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో ప్రత్యూష పెళ్లి జరుగుతుండగా.. ఆమెకు పెళ్లి కానుకగా డైమెండ్ నక్లెస్‌ను అందజేశారు సీఎం స‌తీమ‌ణి శోభ‌మ్మ. ఈ పెళ్లి వేడుకకు ముఖ్యమంత్రి కేసిఆర్ హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు.