పాలిటిక్స్ లోకి మున్నాభాయ్ రీ ఎంట్రీ : ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా?

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మహరాష్ట్రలో అధికార బీజేపీ భాగస్వామ్య పార్టీగా ఉన్న రాష్ట్రీయ సమాజ్ పక్ష్(RSP) పార్టీలో సంజయ్ చేరేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 25,2019న సంజయ్ దత్…ఆర్ఎస్సీలో చేరుతాడని.. ఆ పార్టీ వ్యవస్థాపకులు, మహారాష్ట్ర మంత్రి మహదేవ్ జంకర్ తెలిపారు. పార్టీని బలపరిచే క్రమంలో కొంతమంది సినీ ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. అందులో భాగంగానే సంజయ్ను సంప్రదించామని ఆయన తెలిపారు.
అయితే ఈ విషయంపై ఇంకా సంజయ్ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. సంజయ్ తండ్రి సునీల్ దత్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి ఎంపీగా గెలవడంతో పాటు మన్మోహన్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే.
సంజయ్ గతంలో సమాజ్ వాదీ పార్టీలో పనిచేశారు. 2009లో లక్నో నుంచి ఎస్పీ టిక్కెట్ పై లోక్సభ ఎన్నికల బరిలో కూడా నిలిచారు. అయితే అదే సమయంలో ఆయుధాల కేసులో దోషిగా తేలడంతో తన నామినేషన్ను ఉపసంహరించుకున్నాడు. అనంతరం ఎస్పీ ప్రధాన కార్యదర్శిగా కొంతకాలం పనిచేసిన సంజయ్.. ఆ పదవి నుంచి వైదొలగడంతో పాటు పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ అతడు పోటీ చేస్తాడని రూమర్లు వచ్చినా అలాంటిదేమీ జరుగలేదు.
త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో మున్నాభాయ్ పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం..ఖచ్చితంగా ముంబై నుంచి ఆయన అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు కన్పిస్తోందన్న అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి.