Bollywood Vs Tollywood : నాగవంశీ దెబ్బకు టాలీవుడ్ పై ఏడుపులు.. మన సక్సెస్ ని చూసి కుళ్ళుకుంటున్న బాలీవుడ్..
తెలుగు సినిమాను, తెలుగు నేటివిటీని తక్కువ చేసిన మాట్లాడిన వాళ్లే ఇప్పుడు తెలుగు అనే మాట ఎత్తలేక, ఎత్తకుండా ఉండలేక కడుపు రగిలిపోయి అసూయతో కామెంట్లు చేస్తున్నారు.

Bollywood Target Tollywood in Nagavamsi Issue they Cant Digest our Success
Bollywood Vs Tollywood : దమ్ముంటే ఆపు సినిమాల్లో వాళ్లే తోపు. ఇదీ సదరన్ ఇండస్ట్రీ గురించి నార్త్ పబ్లిక్ అనుకుంటున్న మాట. ఇదే ఇప్పుడు బాలీవుడ్ కడుపు మంటకు కారణం అయింది. ఎన్ని ఈనోలు వేసుకున్నా ఈ మంట ఆరడం లేదా అనిపిస్తోంది ప్రస్తుతం సీన్స్ చూస్తుంటే. బాహుబలి నుంచి మొదలుపెట్టిగా టాలీవుడ్ మీద పడి ఏడవడం బాలీవుడ్ ఇప్పట్లో ఆపేలా కనిపించడం లేదు.
ఎర్రచొక్కా, పచ్చప్యాంట్ అని ఏ నోళ్లు అయితే హేళన చేశాయో అదే నోళ్లు బార్లా తెరిచి మరీ తెలుగు సినిమాను చూస్తున్నాయ్ ఇప్పుడు. తెలుగు సినిమాను, తెలుగు నేటివిటీని తక్కువ చేసిన మాట్లాడిన వాళ్లే ఇప్పుడు తెలుగు అనే మాట ఎత్తలేక, ఎత్తకుండా ఉండలేక కడుపు రగిలిపోయి అసూయతో కామెంట్లు చేస్తున్నారు. ఇదీ బాలీవుడ్ గురించి జనాల్లో వినిపిస్తున్న చర్చ.
టాలీవుడ్ హద్దులు దాటేసింది. సౌత్, నార్త్ లేదు ఇండియన్ సినిమానే.. అదీ తెలుగు సినిమానే అనే స్థాయికి టాలీవుడ్ చేరుకుంది. హిట్ కోసం బాలీవుడ్ స్టార్లు తెలుగు హీరోలు, సౌత్ డైరెక్టర్స్ వెంట పడుతున్నారంటే టాలీవుడ్ రేంజ్ అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకు సౌత్ సినిమా రేంజ్ పెరుగుతుంటే బాలీవుడ్ తట్టుకోలేకపోతోంది. కడుపు మంటతో రగిలిపోతోంది. ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తూ టార్గెట్ చేస్తోంది.
ఇటీవల నిర్మాత నాగవంశీ విషయంలో జరిగింది అదే. టాలీవుడ్లో చాలా ఓపెన్గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడే నిర్మాతగా నాగవంశీకి పేరు. ఇటీవల ఒక రౌండ్ టేబుల్ మీటింగ్లో బాలీవుడ్పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయ్. నిజానికి ఆయన చెప్పిన నిజమే అసలు నిజం కూడా. ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక అర్థం లేని వాదనను తెరమీదకు తీసుకువస్తూ పెద్దలం అని చెప్పుకునే బాలీవుడ్ ప్రముఖులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
బాహుబలి, RRR, పుష్ప2, KGF లాంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ను సౌత్ షేక్ చేస్తుంటే బాలీవుడ్ ఇంకా అర్బన్ ఏరియా మధ్యలోనే స్ట్రక్ అయిదని నాగవంశీ అన్నాడు. పుష్ప2 సినిమా ఒకే రోజు 86 కోట్లు కలెక్ట్ చేసిన రోజు బాలీవుడ్లో ఎవ్వరూ నిద్ర పోయి ఉండరంటూ కామెంట్ చేశారు. ఈ మాటల మీదే బాలీవుడ్ ఇప్పుడు అంతెత్తు ఎగురుతోంది.
అసలు విషయాన్ని పక్కకు నెట్టి బోనీకపూర్ను అవమానిస్తారా అంటూ కొత్త వాదన. కాదు కాదు చెత్తవాదనను తెరమీదకు తెస్తున్నారు బాలీవుడ్ పెద్దలు. తెలుగు సినిమాలు గత పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్లు అవుతున్నంత మాత్రాన అహంకారం పనికి రాదని కామెంట్లు చేస్తూ తమ కోపానికి అసలు కారణం ఏంటో చెప్పకనే చెప్పారు. దర్శకుడు సంజయ్ గుప్తా అయితే వరుస ట్వీట్లతో నాగవంశీ మీద ఎటాక్ చేయగా హన్సల్ మెహతా, సిద్దార్థ్ ఆనంద్ లాంటి పేరున్న డైరెక్టర్లు కూడా సెటైర్లు వేశారు.
ఇక బాలీవుడ్ వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు అయితే నాగవంశీ మీద తీవ్ర స్థాయిలోనే విరుచుకు పడుతున్నాయ్. ఎన్నో ఏళ్ల పాటు మనల్ని తక్కువగా చూసిన బాలీవుడ్ వాళ్లకు నాగవంశీ గట్టి స్ట్రోకే ఇచ్చాడంటూ మన తెలుగు ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. డైజెస్ట్ అయినా కాకపోయినా ఇండియన్ మూవీ ఇంటే ఇప్పుడు సౌత్ సినిమానే. నాగవంశీ చెప్పింది కూడా అదే. హిట్ కోసం మన కథలు కావాలి, మనోళ్లు కావాలి కానీ మనం గ్రేట్ అని ఒప్పుకోవడానికి మాత్రం వాళ్లకు మనసు రాదు. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని మారాల్సింది పోయి తప్పులు వెతికి మరీ టార్గెట్ చేయడం బాలీవుడ్కు అలవాటు అయింది. ఇప్పటికైనా హిందీ చిత్ర పరిశ్రమ మారాల్సిన అవసరం ఉంది.
అయినా టాలీవుడ్ తోపు అని ఎవరూ నమ్మే పని లేదు. ఎవరినీ నమ్మించాల్సిన అవసరం లేదు. టాలీవుడ్, సౌత్ సినిమా స్టామినా ఏంటో వరుస కలెక్షన్లే చెప్తున్నాయ్. బాలీవుడ్ ఖాన్లకు వయసు అయిపోయింది. కుర్ర హీరోలు ఆ లెగసీని క్యారీ చేయలేకపోతున్నారు. ఎంచుకుంటున్న కథలు ప్రేక్షకుడిని థియేటర్కు రప్పించలేకపోతున్నాయ్. ఇలాంటి టైమ్లో సినిమా అంటే ఏంటో, ఎంటర్టైన్మెంట్ పవర్ ఏంటో, ప్రేక్షకుడిని తనకు తాను ఎలా హీరోను చేయొచ్చో తెలుగు సినిమా చూపించింది. పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అవుతోంది. మట్టి కథలు ఎంచుకొని ప్రతీ ప్రేక్షకుడికి దగ్గరవుతోంది. హిట్ కొడుతోంది. బాహుబలి నుంచి పుష్పగాడి జైత్రయాత్ర వరకు జరిగింది అదే. నిజానికి నిర్మాత నాగవంశీ చెప్పిందీ కూడా అదే.
Also Read : Katha Kamamishu : నటుడిగా మారిన డైరెక్టర్.. ఆహాలో మరో కొత్త సినిమా.. కథా కమామీషు..
కాసు ఉన్న కథలు ఎంచుకోవడంలో బాలీవుడ్ వరుసగా విఫలం అవుతోంది. మాస్ కథలను పక్కనపెట్టి హారర్ కామెడీ అంటూ.. స్ట్రీ, మాంజ్యా, భూల్ బులయ్య అంటూ దెయ్యాల వెనక పరుగులు పెడుతోంది. దీంతో ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్కు రావడమే మానేశారు. అలాంటి టైమ్లో తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చింది. ప్రేక్షకులు తగ్గిపోయి థియేటర్లన్నీ ఫంక్షన్ హాళ్లుగా మారుతున్న వేళ నార్త్లో హౌస్ఫుల్ బోర్డుల దుమ్ము దులిపేలా చేసింది.
పుష్ప రిలీజ్ టైమ్లో నార్త్లో చాలా థియేటర్లలో మాస్ జాతర కనిపించింది అంటే అర్థం చేసుకోవచ్చు. మన రేంజ్ ఏంటో. బాహుబలి నుంచి కేజీఎఫ్, కాంతార, సలార్, కల్కి నుంచి ఇప్పుడు పుష్ప 2 వరకు సౌత్ పవర్ ఏంటో చూపించింది. పాన్ ఇండియా సినిమాగా మారిపోయింది. కంటెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్కు రాకుండా ఉండలేరు అని ప్రూవ్ చేసింది.
బీహార్లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారంటే తెలుగు సినిమా స్థాయి అర్థం చేసుకోవచ్చు. నిజానికి హిందీలో సరైన హిట్ లేక ఏళ్లు అయింది. మధ్యలో యానిమల్, జవాన్ అంటూ బ్లాక్బస్టర్ కొట్టినా ఆ సక్సెస్ క్రెడిట్ అంతా సౌత్ డైరెక్టర్లదే. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి. కంటెంట్ విషయంలో ఎందుకు వెనకే ఉండిపోయామో డీకోడ్ చేయాలి. అది వదిలేసి అక్కసు చూపిస్తాం, కడుపు మంట తీర్చుకుంటాం అంటే అంతకుమించిన అజ్ఞానం ఉండదు. బాహుబలి గురించి నాగవంశీ చెప్తుంటే పాత హిందీ సినిమాలు బాహుబలి స్థాయికి దగ్గరగా ఉన్నాయని చెప్పడానికి బోనీ కపూర్ ప్రయత్నించాడు అంటే అప్డేట్ అవ్వట్లేదా అవ్వాలని అనుకోవట్లేదా అనే అనుమానం రాకుండా ఉండదు.
బాలీవుడ్లో హిందీ సినిమాలు తీస్తున్నారు కానీ హిందీ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో మర్చిపోతున్నారు. సౌత్ సినిమా మరీ ముఖ్యంగా తెలుగు సినిమా చూడాలని నార్త్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వాళ్ల సినిమా మన సినిమాలా ఉండాలని అనుకుంటున్నారు. బాలీవుడ్ డైరెక్టర్లు ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. ప్రేక్షకుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఇలాంటి పరిస్థితే వస్తుందని బాలీవుడ్ ఫెయిల్యూర్స్ను డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ బహిరంగంగానే నిలదీశాడు.
సౌత్ సినిమా నుంచి బాలీవుడ్ నేర్చుకోవాలని, ఇన్స్పిరేషన్ అని గతంలో రవీనా టాండన్, సంజయ్ దత్ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. అయినా సరే మార్పును స్వాగతించడం మానేసి టాలీవుడ్ మీద పడి ఏడుస్తోంది బాలీవుడ్. నాగవంశీ చెప్పింది నిజం. ఆయన చెప్పింది తెలుగు సినిమా గొప్పదనం గురించే తప్ప బాలీవుడ్ను తక్కువ చేసి కాదు. తక్కువ బడ్జెట్తో దేశాన్ని జయించే కంటెంట్ను టాలీవుడ్ అందిస్తోందని దీని గురించి బాలీవుడ్ ఆలోచించాల్సిన టైమ్ వచ్చిందన్న సెన్స్లో చెప్పిన మాటలు అవి. ఒకటి మాత్రం నిజం పక్కోడి గొప్పతనం గుర్తించడంలోనే మన గొప్పతనం బయటపడుతుంది. అర్థం లేని వాదనలు చేస్తే అడ్రస్ లేకుండా పోవడమే అని బాలీవుడ్ గుర్తుపెట్టుకోవాలి.
అయినా ఇలా టాలీవుడ్ మీద పడి ఏడవడం బాలీవుడ్కు కొత్తేం కాదు. కల్కి సినిమాలో ప్రభాస్ జోకర్లా ఉన్నాడంటూ ఆ మధ్య ఓ హీరో తన అక్కసు వెళ్లగక్కాడు. ఇక అంతకుముందు తెలుగు హీరోలకు యాటిట్యూడ్ ఎక్కువ అంటూ ఓ హిందీ కెమెరామెన్ అర్ధం లేని వాదన చేశాడు. సలార్ సమయంలో షారుఖ్ సినిమా రిలీజయితే మన సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా బ్లాక్ చేసారు. ఇలాంటివి బోలెడు ఉన్నాయి. అయినా మన సినిమా వాళ్ళు బాలీవుడ్ మీద కామెంట్స్ చేయకుండా తమ సినిమాలు తాము తీసుకుంటున్నా బాలీవుడ్ వాళ్ళు మాత్రం పబ్లిక్ గానే మనల్ని విమర్శించే పని పెట్టుకున్నారు. ఇవన్నీ చూస్తున్న మన ప్రేక్షకులు మమ్మల్ని చూసి ఏడవకండ్రా అంటున్నారు.