టీఎఫ్జెఏ సభ్యులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కృతజ్ఞతలు..

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ నడుస్తుంది. ఈ లాక్డౌన్తో అన్ని ఆసుపత్రులలో రక్త నిల్వలు తగ్గాయి. రక్తదాతలు బయటికి వచ్చే వీలు లేకపోవడంతో.. తలసేమియా వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు.. ఇలా ఎందరో రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారందరినీ ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకు రావడంతో పాటు స్వయంగా ఆయనే రక్తదానం చేసి అందరినీ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. చిరంజీవి పిలుపు మేరకు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు రక్తదానం చేసి వారి ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్కు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున రవణం స్వామినాయుడు ధన్యవాదాలు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘గత వారం రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి పిలుపును అందుకుని ఎందరో ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పెద్దపెద్ద ఆఫీసర్లు అందరూ వచ్చి రక్తదానం చేస్తూనే ఉన్నారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులంతా తరలివచ్చారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ కొంతమందిని నిరోధించడం జరిగింది. రెండు బ్యాచ్లుగా రమ్మని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఫస్ట్ బ్యాచ్గా సుమారు 27 మంది రక్తదానం చేయడం జరిగింది. మరొక బ్యాచ్ మే ఫస్ట్ వీక్లో మరింత అధిక సంఖ్యలో రక్తదానం చేయబోతున్నారు. రక్తదానం చేసిన ప్రముఖుల్లో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు వైజె రాంబాబు, ప్రధాన కార్యదర్శి సురేంద్ర నాయుడు మొదలగువారు ఎందరో సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. వారందరికీ కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీరు మెగాస్టార్ చిరంజీవిగారి గురించి గానీ, చిరంజీవిగారి మెగా కుటుంబం గురించి గానీ ఎప్పుడు కూడా తెలుగు ప్రజలందరికి మరింత చేరువగా అందించే వార్తలు ఎన్నో. గతంలో అలాగే ఇప్పుడు మీ సపోర్ట్ మెగా ఫ్యామిలీకి ఇస్తూనే ఉన్నారు. మీ సేవలు ఎప్పటికీ మరువలేము. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము..’’ అని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ తరపున రవణం స్వామినాయుడు తెలిపారు.