డ్రగ్స్ ఆరోపణలు : నిరూపిస్తే ముంబై వదిలి వెళ్ళిపోతా…కంగనా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ మంగళవారం దీనిపై విచారణకు ఆదేశించారు. బాలీవుడ్లో డ్రగ్ మాఫియాపై మాట్లాడినందుకు, ఆమెనే డ్రగ్స్ తీసుకుంటుందంటూ ఇటీవల కొందరు ఆరోపించారు.
కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూ లో నటుడు శేఖర్ సుమన్ కుమారుడు అధ్యాయన్ సుమన్.. కంగన డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. తనను కూడా డ్రగ్స్ తీసుకోవాలని కంగనా సూచించిందని అధ్యాయన్ సుమన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇవాళ మహారాష్ట్ర హోంమంత్రి విచారణకు ఆదేశించారు.
ఈ విషయంపై స్పందించిన కంగన..తనకు డ్రగ్ డీలర్లతో సంబంధాలున్నాయని నిరూపించగలిగితే తాను ముంబైని శాశ్వతంగా వదిలి వెళ్తానని సవాల్ విసిరింది. ముంబై పోలీసులు, హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. నాకు డ్రగ్ టెస్టులు చేయండి. నా అన్ని కాల్ రికార్డులు పరిశీలించండి. ఏదైనా డ్రగ్స్ డీలర్తో సంబంధాలుగానీ, డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగానీ నిరూపిస్తే.. తప్పు చేశానని ఒప్పుకుంటాను. ముంబైని శాశ్వతంగా వదిలి వెళ్లిపోతానని కంగనా తెలిపింది.