తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను డిమాండ్ చేసిన చిరంజీవి

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకని ఎల్బీస్టేడియంలో ఘనంగా నిర్వహించారు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు సినిమా కోసం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ సంధర్భంగా మాట్లాడిన చిరు తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలను ఓ విషయమై డిమాండ్ చేశారు. మహేష్ని ఎప్పుడు చూసినా బిడ్డ లాంటి ఫీలింగ్ వస్తుందని చెప్పిన చిరూ.. ఒకప్పుడు కృష్ణగారి అబ్బాయి మహేష్. కానీ ఇప్పుడు మహేష్ సాధిస్తున్న విజయాలు చూస్తుంటే మహేష్ తండ్రి కృష్ణగారు అనే స్థాయికి మహేష్ ఎదిగిపోయారని అన్నారు. నిజంగా కృష్ణగారికి ఈ విషయమై గర్వంగా ఉంటుందని అన్నారు. ప్రతి తండ్రికి అంతకంటే ఏం కావాలన్నారు.
ఇదే సంధర్భంగా తెలుగు సినిమాకి మూల స్థంబాల్లో ఒక్కరిగా ఉన్న కృష్ణ గారు. మన సౌతిండియాలో సీనియర్ మోస్ట్ యాక్టర్ అని, రెండు తెలుగు ప్రభుత్వాలు కలిసి కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన వచ్చేలా గట్టి ప్రయత్నం చేస్తే బావుంటుందని, అందుకోసం రెండు ప్రభుత్వాలను రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేస్తున్నట్లుగా చెప్పారు. ఆ పురస్కారం వల్ల కృష్ణ కంటే మనకే గౌరవం అని అన్నారు చిరంజీవి.