SAAHO మానియా : ప్రభాస్ అభిమానుల కోలాహలం

యావత్ భారత్లో సాహో మానియా కనిపిస్తోంది. టాలీవుడ్.. బాలీవుడ్… కోలీవుడ్ అన్న తేడాలేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇపుడు ఎక్కడికి వెళ్లినా ఒకటే టాక్ వినిపిస్తోంది. సాహో సినిమా 2019. ఆగస్టు 30వ తేదీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఏపీలో పలుచోట్ల స్పెషల్ షోలు ప్రారంభమయ్యాయి. థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ప్రభాస్ అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు సాహోను చూద్దామా అన్న ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అత్యధిక థియేటర్లలో రిలీజవుతూ రికార్డులను సృష్టిస్తోంది సాహో. ప్రపంచవ్యాప్తంగా 10వేల థియేటర్లలో సందడి చేస్తోంది. భారత్లో 8వేల థియేటర్లు, విదేశాల్లో 2వేల థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే 2వేలకు పైగా స్క్రీన్లలో మెరుస్తోంది. బాహుబలి – 2 తమిళనాడులో 525 థియేటర్లలో రిలీజ్ కాగా సాహో ఏకంగా 550 స్క్రీన్లలో రిలీజ్ అయ్యింది. కర్నాటకలోనూ ఫస్ట్ టైమ్ 500కు పైగా థియేటర్లలో, కేరళలో 300 థియేటర్లలో రిలీజ్ అయ్యింది సాహో.
సాహో మూవీ ప్రత్యేక షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి ఒంటిగట నుంచి ఉదయం 10 గంటల మధ్యలో రెండు ప్రత్యేక షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ఆగస్టు 30వ తేదీ శుక్రవారం నుంచి సెప్టెంబర్ 5 వరకు ఈ ప్రత్యేక షోలు ప్రదర్శించనున్నారు. సాహో చిత్రంపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో నిర్మాతలు స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో స్పెషల్ షోలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
Read More : భీమవరం – ప్రభాస్ సాహో మయం