మహా పీఠంపై ఉత్కంఠ…ఢిల్లీలో రెండు హాట్ మీటింగ్స్

  • Published By: venkaiahnaidu ,Published On : November 4, 2019 / 09:18 AM IST
మహా పీఠంపై ఉత్కంఠ…ఢిల్లీలో రెండు హాట్ మీటింగ్స్

Updated On : November 4, 2019 / 9:18 AM IST

మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉన్నాయి. గత నెల 24న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమికి పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. చెరో రెండున్నసంవత్సరాల పాటు సీఎం సీటుని పంచుకోవాలంటూ 50:50 ఫార్ములాకు శివసేన పట్టుబడుతోంది. అయితే బీజేపీ అందుకు ఒప్పుకోవడం లేదు. బీజేపీ తమ డిమాండ్ లకు ఒప్పుకోకుంటే ఎన్సీపీ తమకు మద్దతిచ్చేందుకు రెడీగా ఉందంటూ శివసేన బీజేపీని పరోక్షంగా హెచ్చరిస్తోంది. మూడు రోజుల క్రితం శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమైన విషయం తెలిసిందే.

ఈ సమయంలో ఇవాళ ఢిల్లీలో రెండు మీటింగ్స్ మహారాష్ట్రలో నెలకొన్న సందిగ్దానికి తెరదించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకుడు,మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ(నవంబర్-4,2019)ఢిల్లీలో బీజేపీ చీఫ్,కేంద్రహోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. బయటకి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు మరింత సాయం కోరేందుకే అమిత్ షా సమావేశమైనట్లు దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతున్నప్పటికీ మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిపైనే వీరి మధ్య ఎక్కువగా చర్చ జరిగినట్లు అర్థమవుతోంది. అమిత్ షాతో భేటీ అనంతరం ఫడ్నవీస్ మాట్లాడుతూ…మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఎవరైనా చెప్పే దేనిపైనా తాను కామెంట్ చేయదల్చుకోలేదని,అయితే త్వరలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని మాత్రం చెప్పదల్చుకున్నానని,తాను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని ఫడ్నవీస్ తెలిపారు. బీజేపీ మహారాష్ట్ర ఇన్ చార్జ్ భూపేంద్రయాదవ్ తో కూడా ఫడ్నవీస్ ఢిల్లీలో కలిశారు.

మరోవైపు ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమవుతున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితిని సోనియాకు పవార్ వివరించనున్నారు. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు రానుంది. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వ కాలం నవంబర్-8,2019తో ముగుస్తుంది. అప్పటిలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.