Children Test Covid Positive : బెంగళూరులో చిన్నారులపై కరోనా పంజా..5 రోజుల్లో 242మంది పిల్లలకు పాజిటివ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజులుగా చిన్నపిల్లలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంది.

Children
Children Test Covid Positive కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజులుగా చిన్నపిల్లలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన ఐదు రోజుల్లో బెంగళూరులో 19ఏళ్ల లోపు వయస్సు ఉన్న 242 మంది పిల్లలు కరోనా బారిన పడినట్లు మంగళవారం బెంగళూరు మహానగర పాలికే(BBMP) తెలిపింది.
కోవిడ్ బారిన పడిన ఈ చిన్నారుల్లో తొమ్మిదేళ్ల లోపు వారు 106 మంది ఉన్నారని తెలిపింది. అయితే, కోవిడ్ థర్డ్ వేవ్.. చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్న అంచనాల నేపథ్యంలో ఈ పరిణామం ఇప్పుడు కలవరపెడుతోంది. అయితే, రానున్న రోజుల్లో చిన్నపిల్లల్లో కరోనా కేసులు మరిన్ని పెరిగే ముప్పు ఉందని కర్ణాటక ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక, థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
కర్ణాటక ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి తాజా పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. వచ్చే రోజుల్లో ఈ కేసులు మూడింతలకు పెరిగే అవకాశముందని ఆ అధికారి అంచనా వేశారు. పిల్లలను ఇంటి నుంచి బయట అడుగుపెట్టకుండా చూసుకుని వైరస్ బారి నుంచి కాపాడుకోవడమే మన చేతుల్లో ఉందని ఆయన తెలిపారు. పెద్దలతో పోల్చితే చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, కాబట్టి పిల్లలను ఇంటికే పరిమితం చేయాలని తెలిపారు.
మరోవైపు, కర్ణాటకలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ(రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు) విధించింది. మహారాష్ట్ర, కేరళలో రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూ విధించారు. 8 కర్ణాటక సరిహద్దు జిల్లాలు- మైసూర్,చారమాజ్ నగర్,మంగళూరు,కొడగు,బెళగావి,బీదర్,కలబుర్గి,విజయాపుర జిల్లాలో వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం బసవరాజ్ బొమ్మై గత వారం తెలిపారు.
READ : Weekend Lockdown,Night Curfew : మళ్లీ లాక్ డౌన్ లు,నైట్ కర్ఫ్యూలు వచ్చేశాయ్