Congress: ఇప్పటికే 40 గంటల పాటు విచారణ.. నేడు మళ్లీ ఈడీ ఆఫీసుకి వెళ్లిన రాహుల్
నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐదోరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు.
Congress: నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐదోరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఆయనను ఈడీ అధికారులు మొత్తం కలిపి 40 గంటల పాటు విచారించారు. నేటితో ఆయన విచారణ ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, సోనియా గాంధీ కూడా నగదు అక్రమ చలామణీ కేసులో ఈ నెల 23న ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది.
సోనియా గాంధీ ఇప్పటికే విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆమెకు కరోనా సోకడం, అనంతరం కొవిడ్ అనంతర సమస్యలతో ఆసుపత్రిలో చేరడం వంటి కారణాలతో ఆమె హాజరు కాలేదు. రాహుల్ గాంధీని ఈడీ వేధిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆయనను గంటలకొద్దీ విచారిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది.