తండ్రి స్థానం నుంచి లోక్ సభ బరిలో అఖిలేష్

ఎస్సీ అధ్యక్షుడు,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారు.ఏళ్లుగా తమ పార్టీకి కంచుకోటగా ఉన్న తండ్రి ములాయం సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు యూపీలోని ఆజమ్ గఢ్ లోక్సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు.ముస్లిం-యాదవ్ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సమాజ్ వాది పార్టీకి మంచి పట్టుంది.తూర్పు యూపీ నుంచి అఖిలేష్ ఎన్నికల బరిలోకి దిగడం ఇదే మొదటిసారి.
2014లో గెలిచి తర్వాత రాజీనామా చేసిన మెయిన్ పురి స్థానం నుంచే ములాయం సింగ్ యాదవ్ ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు ఆదివారం(మార్చి-24,2019)సమాజ్ వాది పార్టీ ప్రకటించింది. ఎస్పీ కంచుకోట అయిన మరో స్థానం రామ్ పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆజాం ఖాన్ పోటీచేయనున్నట్లు తెలిపారు.2009లో మూడోసారి కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించిన అఖిలేష్ 2012లో ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో ఎంపీగా రాజీనామా చేశారు.అఖిలేష్ రాజీనామాతో ఆయన భార్య డింపుల్ యాదవ్ కన్నౌజ్ ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఈసారి కూడా అక్కడి నుంచి ఆమెనే బరిలోకి దింపనున్నట్లు పార్టీ ప్రకటించింది. తొలుత అఖిలేశ్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి.అయితే ఆ ఊహాగానాలకు ఆదివారం ఎస్పీ తెరదించింది.