Allahabad HC : మసీదులపై లౌడ్ స్పీకర్ల విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
మసీదులపై లౌడ్ స్పీకర్ల విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

Dismisses Plea Seeking Installation Of Loudspeaker In Mosques
Allahabad HC.. loudspeaker in mosques : రాష్ట్రాల్లో మసీదులపై లౌడ్ స్పీకర్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు నడుస్తున్న సమయంలో ఈ విషయంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. లౌడ్ స్పీకర్లు ప్రాథమిక హక్కు కానే కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ వికాస్లతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేస్తూ.. ‘‘మసీదుల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం రాజ్యాంగ హక్కు కాదని చట్టం చెబుతోంది అని తెలిపింది.
ఇర్ఫాన్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ జిల్లా పరిధిలో దొరన్ పూర్ గ్రామంలోని నూరి మసీదుపై లౌడ్ స్పీకర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సబ్ కలెక్టర్ (SDM) అనుమతి ఇవ్వలేదు. ఎస్ డీఎం ఆదేశాలు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, చట్టపరమైన హక్కులకు వ్యతిరేకమంటూ ఇర్ఫాన్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ సందర్భంగా ఇరు వైపు వాదనలు విన్న జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ వికాస్ తో కూడిన ధర్మాసనం.. మసీదులపై లౌడ్ స్పీకర్ల వినియోగం రాజ్యాంగపరమైన హక్కు కాదని చట్టం చెబుతోందంటూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ ను కొట్టివేసింది.