ముకేశ్ అంబానీ, నారాయణ మూర్తి ముఖంతో డీప్ఫేక్ వీడియోలు.. రూ.95 లక్షలు మోసపోయిన ఇద్దరు వ్యక్తులు
అది నారాయణ మూర్తికి చెందిన నిజమైన వీడియోనే అనుకుని, ఓ లింక్ను క్లిక్ చేసింది బాధిత మహిళ.

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి సంబంధించిన డీప్ఫేక్ వీడియోలను చూసి ఇద్దరు బెంగళూరు వాసులు రూ.95 లక్షలు మోసపోయారు. దీనిపై కేసు నమోదుచేసుకున్న అధికారులు వివరాలు తెలిపారు.
బనశంకరికి చెందిన ఒక మహిళ సామాజిక మాధ్యమాల్లో నారాయణ మూర్తికి సంబంధించిన డీప్ఫేక్ వీడియోను చూసింది. తమ వద్ద పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని అందులో చెప్పారు. అది నారాయణ మూర్తికి చెందిన నిజమైన వీడియోనే అనుకుని, ఓ లింక్ను క్లిక్ చేసింది బాధిత మహిళ.
దీంతో ఓ ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఆ ప్లాట్ఫాంలో రూ.1.4 లక్షల పెట్టుబడి పెట్టింది ఆ మహిళ. దీంతో మొదట ఆ మహిళ రూ.8 వేల ఆదాయాన్ని పొందింది. లాభాలు నిజంగానే వస్తున్నాయనుకుని, ఆ మహిళకు ఆశ పెరిగి, ఆ తర్వాత మరిన్ని పెట్టుబడులు పెట్టి మొత్తం రూ.67 లక్షలు మోసపోయింది.
మరో కేసులో, ఓ రిటైర్డ్ ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో ముకేశ్ అంబానీకి సంబంధించిన డీప్ ఫేక్ వీడియోను చూశాడు. అది నిజంగా ముకేశ్ అంబానీ వీడియోనే అనుకుని దాని కింద ఉన్న లింక్ను క్లిక్ చేసి, పెట్టుబడిగా రూ.19 లక్షలు పంపాడు. ఆ తర్వాత సైబర్ మోసగాళ్ల నుంచి రిప్లై రాలేదు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించి, అధికారులకు ఫిర్యాదు చేశాడు. పెట్టుబడుల పేరుతో చాలా మంది కేటుగాళ్లు ఇలాగే వ్యాపారుల డీప్ ఫేక్ వీడియోలతో మోసాలకు పాల్పడుతున్నారు.
Gold Price: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా..