హ్యాట్సాఫ్ మాస్టారు.. రూపాయికే విద్య, ఇంటి వాకిలే స్కూల్, రిటైర్మెంట్ తర్వాత కూడా టీచింగ్

హ్యాట్సాఫ్ మాస్టారు.. రూపాయికే విద్య, ఇంటి వాకిలే స్కూల్, రిటైర్మెంట్ తర్వాత కూడా టీచింగ్

Updated On : February 26, 2021 / 5:14 PM IST

Bihar teacher Teaching Kids For Re 1: ఈ రోజుల్లో అంతా మనీ మైండెండ్ అయిపోయారు. రూపాయి లాభం లేనిదే ఏ పనీ చెయ్యడం లేదు. ఏదో ఒక ప్రయోజనం ఉంటేనే పని చేస్తున్నారు. మనిషిలో స్వార్థం పెరిగిపోయింది. డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నాడు. మరీ ముఖ్యంగా విద్య చాలా కాస్ట్లీగా మారింది. చదువుని కొనే పరిస్థితి ఏర్పడింది. నాణ్యమైన విద్య కావాలంటే లక్షలకు లక్షలు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి ఈ రోజుల్లోనూ మనుషుల్లో కొందరు మంచోళ్లు కనిపిస్తున్నారు. నిస్వార్థంగా సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ పంతులు ఆ కోవకు చెందిన వారే. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, రిటైర్మెంట్ తర్వాత కూడా పేద పిల్లలకు చదువు నేర్పిస్తున్నారీ మాస్టారు. అదీ, కేవలం రూపాయి ఫీజుకే.

వృద్ధాప్యంలోనూ టీచర్ గా పని:
ఆయన పేరు లోకేష్ శరణ్. బీహార్ లోని సమస్తిపూర్ లో ఉంటారు. లోకేష్.. టీచర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. సాధారణంగా ఏ ఉద్యోగి అయినా, రిటైర్మెంట్ తర్వాత ఇంట్లోనే హాయిగా కూర్చొని సేద తీరాలని అనుకుంటారు. మనవళ్లు.. మనవరాళ్లతో ఆడుకుంటూ కాలం గడపడాలని ఉబలాటపడతారు. కానీ, ఈ 61 ఏళ్ల లోకేష్ మాస్టారు మాత్రం అలా అనుకోలేదు. టీచర్‌గా ఉద్యోగం చేసినప్పుడు ఎంతో మందిని భావి పౌరులుగా తీర్చిదిద్దిన ఆయన.. వృద్ధాప్యంలోనూ అదే పని కొనసాగిస్తున్నారు. తన తండ్రి ఏర్పాటు చేసిన స్కూల్ మూతపడగా.. తన ఇంటి వాకిలినే పాఠశాలగా మార్చేశారు. ఫీజులు కట్టి చదవుకొనలేని పేద విద్యార్థుల నుంచి కేవలం ఒక్క రూపాయి ఫీజుగా తీసుకొని వారికి చదువు చెబుతున్నారు.

Hero Teacher From Bihar Started Teaching Kids For Re 1 After His School Closed Down

సొంత బడిలో టీచర్ గా, పత్రికా విలేకరిగా:
లోకేష్ శరణ్ 1986లో బీఏ పూర్తి చేశారు. 1988లో బీఈడీ చేశారు. లోకేష్ తండ్రి కూడా టీచరే. 1983లో సొంతంగా బాల సైనిక్‌ విద్యాలయం పేరుతో స్కూల్ ఏర్పాటు చేశారు. బీఎడ్‌ పూర్తి చేసిన శరణ్‌, తన తండ్రి స్కూల్ లోనే విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. ఈ క్రమంలో పేద విద్యార్థులు.. చదువుకు నోచుకోలేని చిన్నారులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సైతం నివేదిక ఇచ్చారు. ఆయన అధ్యయనాలు, కథనాలు మెచ్చి ఓ పత్రిక యాజమాన్యం లోకేష్ ను జర్నలిస్టుగా నియమించుకుంది. చాలాకాలం సొంత బడిలో టీచర్‌గా.. ఒక పత్రిక విలేకరిగా వ్యవహరిస్తూ వచ్చారు లోకేష్.

అయితే విద్యార్థుల నుంచి తక్కువ ఫీజు తీసుకోవడం వల్ల స్కూల్ లో ఎక్కువ మౌలిక వసతులు కల్పించలేకపోయారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను అన్ని వసతులున్న మంచి స్కూళ్లలో చేర్పించడానికి మొగ్గుచూపారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కొన్నేళ్ల కిందట 2013లో పాఠశాలను పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రూపాయికే విద్య:
స్కూల్ మూతపడ్డా.. తను రిటైర్ అయినా.. పేద విద్యార్థులకు చదువు చెప్పాలన్న ఆశయం మాత్రం శరణ్‌లో అలాగే ఉంది. అందుకే, తన ఇంటి ముందు వాకిలిలో ఒక తరగతి గది నిర్మించారు. వేలు, లక్షల ఫీజులు కట్టి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదువుకోలేని విద్యార్థులకు, పాఠశాలల్లో చదువుకుంటున్నా.. పాఠాలు అర్థం కానీ విద్యార్థులకు కేవలం రూపాయి ఫీజు తీసుకొని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు లోకేష్ సార్.

లోకేష్ సార్, కేవలం పాఠాలకే పరిమితం అవలేదు. విద్యార్థుల చేతిరాత మెరుగుపర్చుకునే శిక్షణ కూడా ఇస్తున్నారు. అలాగే, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ తన ఇంట్లోనే కాదు, వృత్తిరీత్యా తన కొడుకు ఎక్కడికి ట్రాన్సఫర్ అయినా.. అతడిని చూసేందుకు వెళ్లిన ప్రతిసారి స్థానిక స్కూల్ లో కనీసం వారం పాటు పాఠాలు చెబుతారు. అలాగే, సివిల్‌ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సలహాలు, సూచనలు కూడా ఇస్తారు.

కరోనా సమయంలో స్కూళ్లు మూతపడినట్లే.. తన ఇంటి తరగతి గది కూడా మూతపడింది. అయినా విద్యార్థులకు చదువు చెప్పడం మానేయలేదు. రూపాయి ఫీజుతోనే కొంత కాలంగా ఆన్‌లైన్‌ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారీ మాస్టారు.

లోకేష్ శరణ్ అనుకుంటే వేల రూపాయల ఫీజులు వసూలు చేయొచ్చు. కానీ, ఆయనది నిస్వార్థ సేవ. ఓ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. పైసామే పరమాత్మ అనే ఈ రోజుల్లోనూ లోకేష్ శరణ్ లాంటి వారు ఉన్నారంటే నమ్మబుద్ధి కావడం లేదని నెటిజన్లు అంటున్నారు. ఈ మాస్టారి నిస్వార్థ సేవను అంతా మెచ్చుకుంటున్నారు. లోకేష్ శరణ్.. నేటి తరానికి ఆదర్శమూర్తి అని కొనియాడుతున్నారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్.. అని సలామ్ చేస్తున్నారు. లోకేష్ శరణ్ ది చాలా గొప్ప సంకల్పం అని కితాబిస్తున్నారు. అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని, ఆయన దారిలో మరింత మంది నడవాలని మనమూ ఆకాంక్షిందాం.