Modi vs Pilot: ‘కాంగ్రెస్ రనౌట్’ అన్న ప్రధానికి అదే స్టైల్లో రిప్లై ఇచ్చిన సచిన్ పైలట్

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతల మద్య తీవ్ర వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Modi vs Pilot: ‘కాంగ్రెస్ రనౌట్’ అన్న ప్రధానికి అదే స్టైల్లో రిప్లై ఇచ్చిన సచిన్ పైలట్

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మద్య పోరు రణరంగాన్ని తలపిస్తోంది. ఇరు పార్టీల నేతలు తరుచూ మాటల తూటాలతో దాడి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘‘కాంగ్రెస్ పార్టీలో ఒకరికొకరు రనౌట్ చేసుకుంటున్నారు’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అదే స్టైల్లో సమాధానం ఇచ్చారు. ‘‘బీజేపీ తనకు తానే హిట్ వికెట్’’ అంటూ మోదీ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు.

ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతల మద్య తీవ్ర వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘ఎక్కువ స్కోర్ చేయడానికి బదులు ఒకరికొకరు రనౌట్ చేసుకుంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. అంటే గెహ్లాట్, పైలట్ ఒకరి ఓటమి కొరకు మరొకరు పని చేస్తున్నారని మోదీ విమర్శలు గుప్పించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన డీఎంకే

ఈ వ్యాఖ్యలపై మంగళవారం సచిన్ పైలట్ స్పందిస్తూ.. ‘‘పార్టీని గెలిపించడం నా మొదటి పని. నేను ఆ పనిలో చాలా బిజీగా ఉన్నాను. నాపై కొందరు అనుచిత భాషలో మాట్లాడతారు. వారికి సమాదానం ఇచ్చే తీరిక నాకు లేదు. ఒకవేళ ఇచ్చినా నేను మంచి భాషలోనే ఇస్తాను’’ అని అన్నారు. కాగా, ఈ యేడాది ప్రారంభంలోనే గెహ్లాట్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ పైలట్ నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. దీంతో పైలట్ మీద గెహ్లాట్ అప్పట్లో తీవ్రంగా విరుచుకుపడ్డారు.