రైతు సంఘాలతో అర్ధాంతరంగా ముగిసిన కేంద్రం చర్చలు..ఈ నెల 15న మరోసారి

concluded Center government talks with farmer associations : రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఈ నెల 15న మరోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరుపనుంది. వ్యవసాయ చట్టాలపై రైతులు, కేంద్రం వెనక్కి తగ్గలేదు. చట్టాలను రద్దు చేస్తేనే ఉద్యమం ఆపుతామని రైతులు తేల్చి చెప్పారు. చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయం లేదని రైతు సంఘాలు అంటున్నాయి.
ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం సాగదీస్తోందని రైతు సంఘాల నేతలు అంటున్నారు. మరోవైపు చట్టాలను వెనక్కితీసుకునేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని కేంద్రమంత్రి తోమర్ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశిస్తే చట్టాలను వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు.
కేంద్రం-రైతుల చర్చల్లో అదే ప్రతిష్టంభన కొనసాగింది. ఎనిమిదో విడత చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదే లేదని కేంద్రం తేల్చేసింది. అవసరమైతే సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని కేంద్రం భావిస్తోంది. చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెబితేనే కొత్త చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు… చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమం ఆపేదే లేదని రైతులు హెచ్చరించారు.
చట్టాలను వెనక్కి తీసుకుంటేనే ఇళ్లకు తిరిగి వెళ్తామని తెగేసి చెబుతున్నారు. విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటామని రైతు సంఘాల నేతలు నినాదాలు చేశారు. భోజన విరామం తీసుకునేందుకు రైతులు నిరాకరించారు. రైతు సంఘాలు మాత్రం వ్యవసాయ చట్టాలు రద్దు చేసేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశాయి. రైతులతో చర్చలు జరుపుతున్న కేంద్ర మంత్రులు సమావేశ స్థలాన్ని వదిలి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
కేంద్ర తీసుకువచ్చినవ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే…. రైతు సంఘాలను కేంద్రం చర్చలకు ఎందుకు పిలుస్తుందని రైతు పోరాట సమన్వయ సమితి కో-కన్వీనర్ హన్నన్ మొల్లా ప్రశ్నించారు. రైతులు చలిలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే… కేంద్ర పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని.. వెంటనే రద్దు చేసి.. పంటలకు మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు. చట్టాల్లో ఎలాంటి సవరణలను అంగీకరించబోమని సృష్టం చేశారు.