BJP: రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్ నేతలకు కోర్టు సమన్లు

బెంగళూరులోని అడిషనల్ చీఫ్ మెట్రోపొలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ లో బీజేపీ ఫిర్యాదు చేసింది.

BJP: రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్ నేతలకు కోర్టు సమన్లు

Rahul Gandhi - Siddaramaiah

Updated On : June 14, 2023 / 4:06 PM IST

BJP – Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar), కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC)పై బీజేపీ పరువు నష్టం కేసు వేసింది.

బెంగళూరులోని అడిషనల్ చీఫ్ మెట్రోపొలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ లో ఈ మేరకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయా నేతలను కోర్టు సమన్లు పంపింది. జూలై 27న వారి సమాధానాన్ని రికార్డు చేస్తామని తెలిపింది. బీజేపీని కించపర్చేలా కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చిందని మే 9న బీజేపీ కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి ఎస్.కేశవప్రసాద్ ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ నేతల సమాధానం కోరుతూ సమన్లు పంపింది. ఎన్నికల వేళ మే 5న కేపీసీసీ పలు దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చిందని బీజేపీ అంటోంది. నాలుగేళ్లలో ” 40 శాతం అవినీతి ” , రూ.1.5 లక్షల కోట్ల లూటీ అంటూ అందులో గత బీజేపీ కర్ణాటక సర్కారుని ఉద్దేశించి కేపీసీసీ పేర్కొందని చెప్పింది.

అవన్నీ నిరాధార ఆరోపణలని, తమను కించపర్చేలా ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కోరింది. కర్ణాటకలో తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయం తెలిసిందే. బీజేపీ ఘోరంగా ఓడిపోయింది.

Minister Amit Shah : మరోసారి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు