ఒక్కరూ లేరే : ప్రయాణీకులు లేని రైలు..103 కిలోమీటర్లు పరుగులు

ఒక్కరూ లేరే : ప్రయాణీకులు లేని రైలు..103 కిలోమీటర్లు పరుగులు

Empty Train 103 Kilometers Journey

Updated On : March 25, 2021 / 5:40 PM IST

empty train 103 Kilometers Journey : ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రయాణీకులు లేకుండా ఓ రైలు ఏకంగా 103 కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టింది. రైలులో ఒక్కరంటే ఒక్కరూ కూడా ప్రయాణీకులు లేదు. కేవలం రైలు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, ఒక గార్డుతో రైలు మూడు గంటలపాటు 103 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన యూపీలో జరిగింది.

యూపీలోని థావె నుంచి ఛప్రా కచ్రీ వరకూ వెళ్లే ఒక అన్ రిజర్వ్‌డ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్క ప్రయాణికుడూ లేకుండా కేవలం డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, ఒక గార్డుతో మూడు గంటల పాటు, 103 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించింది. మార్చి 21న 10 జనరల్ బోగీలతో ప్రయాణించిన ఈ రైలులోకి ఏ స్టేషన్‌లోనూ కనీసం ఒక్క ప్రయాణికుడు కూడా ఎక్కకపోవటం విశేషం. అయినా సరే ఈ రైలు ప్రయాణం ఆగలేదు.

రైలు ఎక్కేవారూ లేరు..దీంతో దిగేవారు కూడా ఎవ్వరూ లేకుండానే ఉత్తఖాళీగానే ప్రయాణించాల్సి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు మొత్తం 25 స్టేషన్ల మీదుగా ప్రయాణించింది. నిర్దారిత సమయానికి బయలుదేరి ప్రతీ‌స్టేషన్‌లోనూ నిర్దేశిత సమయం మేరకు ఆగుతూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. రాత్రి 10.00లకు ఛప్రా కచ్రీకి చేరుకుంది.కాగా గత మార్చి 8 నుంచి అన్‌రిజర్వ్‌డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఛార్జీలను రిజర్వ్‌డ్ రైళ్ల చార్జీలతో సమానంగా చేసినప్పటి నుంచి ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదని మాత్రం తెలుస్తోంది.