Lok Sabha elections 2024: బెంగాల్లో 35 సీట్లు ఇవ్వండి చాలు.. ఈ పని జరుగుతుంది: అమిత్ షా
Lok Sabha elections 2024: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో 35 స్థానాల్లో గెలిస్తే ఏం చేస్తామో చెప్పారు.

Lok Sabha elections 2024
Lok Sabha elections 2024: లోక్ సభ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. తాజాగా, పశ్చిమ బెంగాల్లోని భీర్భూమ్ జిల్లా సురీ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించిన కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్ సభ స్థానాలు ఉండగా, వాటిలో 35 సీట్లలో బీజేపీని గెలిపించాలని అన్నారు.
“మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్లో అక్రమ పరిపాలనపైనే దృష్టిపెట్టారు. రాష్ట్రంలో టీఎంసీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం. మేము గో అక్రమ రవాణాను అడ్డుకున్నాం. పశ్చిమ బెంగాల్లో చొరబాట్లు జరగాలని మీరు కోరుకుంటున్నారా? బీజేపీకి ఓటు వేస్తేనే అక్రమ చొరబాట్లు ఆగుతాయి.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 35 స్థానాల్లో మమ్మల్ని గెలిపించండి. మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా గద్దెదిగుతుంది. పశ్చిమ బెంగాల్లో అవినీతి జరుగుతోంది. బీజేపీ మాత్రమే దాన్ని అడ్డుకోగలదు” అని అమిత్ షా చెప్పారు. కాగా, అమిత్ షా పర్యటనపై టీఎంసీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వలస పక్షిలా వచ్చి వెళ్లిపోతారని ఎద్దేవా చేస్తున్నారు. 2021లో కేంద్ర సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుని లబ్ధిపొందాలని కుట్రలు పన్నిందని అయినప్పటికీ టీఎంసీని ఓడించలేకపోయిందని అన్నారు.