Edible Oils : వంట నూనెల నిల్వలపై కేంద్రం ఆంక్షలు..భారీగా తగ్గనున్న ధరలు!
దేశీయ మార్కెట్ లో భారీగా పెరిగిపోతున్న వంట నూనె మరియు నూనె గింజల ధరలను తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Oil
Edible Oils దేశీయ మార్కెట్ లో భారీగా పెరిగిపోతున్న వంట నూనె మరియు నూనె గింజల ధరలను తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల దగ్గర నూనె, నూనె గింజల నిల్వలపై పరిమితులు విధిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి-31వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుత నిల్వలు ఎంత..వాటిని ఎలా వినియోగిస్తున్నారు అనే అంశాలను పరిగణించి పరిమితులపై నిర్ణయం తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జారీ చేసిన ఆదేశాల్లో వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అయితే కొంతమంది ఎగుమతి, దిగుమతిదారులకు పరిమితుల నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్.. ఎక్స్పోర్టర్- ఇంపోర్టర్ కోడ్ ఇచ్చిన వారికి మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయని తెలిపింది. చట్టపరమైన సంస్థలు ఏవైనా పరిమితికి మించి నిల్వలను కలిగి ఉంటే ఆ వివరాలను ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్లో పొందుపరచాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలు ఎప్పటికప్పుడు నూనెలు, నూనె గింజల పరిమిమతుల వివరాలని కేంద్రప్రభుత్వం వెబ్సైట్లో అప్డేట్ చేయాలని కోరింది. కాగా,తాజా నిర్ణయంతో త్వరలోనే ధరలు సాధారణ స్థాయికి దిగిరావచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.
దేశీయంగా వంట నూనెల ధరలు కేవలం ఏడాది కాలంలో 46.15 శాతం పెరిగాయి. అంతర్జాతీయ కారణాలు, దేశీయంగా సరఫరా తగ్గటం వంటివి ఇందుకు కారణమని ప్రభుత్వం చెబుతోంది. అయితే దేశంలో ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించాక నూనె ధరలు 3.26 శాతం నుంచి 8.58 శాతం వరకూ పడిపోయాయని రెండు రోజుల క్రితం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో గత నెలరోజుల్లో సోయాబీన్, పొద్దు తిరుగుడు, పామాయిల్, ఆర్ బీడీ పామోలిన్ ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. విదేశాల్నించి దిగుమతి చేసుకునే నూనెలపై సెప్టెంబర్ 11 నుంచి దిగుమతి పన్ను తగ్గించడంతో నూనె ధరలు కూడా తగ్గాయి.