Karnataka Election 2023: 10వేల రూపాయి నాణేలతో నామినేషన్కు స్వతంత్ర అభ్యర్థి.. రెండు గంటలు శ్రమించిన అధికారులు ..
స్వతంత్ర అభ్యర్థి యంపక్ప కలబురగి జిల్లాలోని గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్ గ్రాడ్యుయేట్. అతని మొత్తం ఆస్తి రూ. 60వేలు ఉంటుంది.

One Rupee coins
Karnataka Election 2023: కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. రాజకీయ పార్టీల నేతలు విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆ రాష్ట్రంలోని వీధులన్నీ పార్టీల నేతల ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మే 10న పోలింగ్ జరగనుండగా, మే 13న ఫలితాలు వెల్లడవుతాయి. ప్రస్తుతం నామినేషన్ ల ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నేతల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఓ స్వతంత్ర్య అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు 10వేల రూపాయి నాణేలను తీసుకొని వచ్చాడు. వాటిని చూసిన అధికారులు అవాక్కయ్యారు. రెండు గంటలు పాటు వారు శ్రమించాల్సి వచ్చింది.
కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో యాదగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థిగా యంకప్ప నామినేషన్ దాఖలు చేసేందుకు రూ. 10వేలను రూపాయి నాణేల్లో డిపాజిట్ చేశాడు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంకు చేరుకొని నామినేషన్ పత్రాలు దాఖలు సమయంలో డిపాజిట్ కోసం 10వేల రూపాయి నాణేలను తీసుకొచ్చాడు.
Karnataka Election 2023 : కోట్లకు పడగలెత్తిన కర్ణాటక మంత్రిగారి ఆస్తులు .. చదివింది మాత్రం 9వ తరగతే
అతని మెడలో నేను స్వతంత్ర అభ్యర్థిని బ్యాడ్జీకూడా వేసుకున్నాడు. దీంతో అధికారులు వాటిని టేబుల్పై పోసి లెక్కించారు. వీటిని లెక్కించేందుకు వారికి రెండు గంటలపాటు సమయం పట్టింది. సదరు స్వతంత్ర అభ్యర్థి యంకప్ప వీటిని నియోజకవర్గ ప్రజల నుంచి సేకరించాడు. ఇంటింటికి కాలినడకన పర్యటించి నాణేలు సేకరించినట్లు తెలిపాడు. అంతేకాదు, మీరు రూపాయి ఇవ్వడమే కాదు, నాకు ఓటువేయాలని ఓటర్లను వేడుకున్నారు. నాకు ఓటు వేసి గెలిపిస్తే పేదలను ధనికులుగా మార్చేందుకు తన ప్రయత్నం ఉంటుందని చెప్పాడు.
స్వతంత్ర అభ్యర్థి యంకప్ప రూపొందించిన పోస్టర్లో 12వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త బసవేశ్వర, కర్ణాటక సన్యాసి కనకదాసు, స్వామి వివేకానంద, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రాలు, రాజ్యాంగ ప్రవేశిక ఉన్నాయి. యంపక్ప గ్రాడ్యుయేట్. అతను కలబురగి జిల్లాలోని గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్ గ్రాడ్యుయేట్. అతని మొత్తం ఆస్తి రూ. 60వేలు ఉంటుంది. తండ్రి దేవింద్రప్పకు ఒక ఎకరం, 16 గుంటల భూమి ఉంది.