ఢిఫెన్స్ టెక్నాలజీలో భారత్ రన్నరప్…ట్రోఫీ లేదన్న అజిత్ దోవల్
మనకు అనుగుణమైన టెక్నాలజీతో భారత్ను మరింత సురక్షితంగా తయారు చేయాలన్నారు జాతీయ భద్రతా సలహాదారుడు(ఎన్ఎస్ఏ)అజిత్ దోవల్. మంగళవారం ఢీల్లీలో జరుగుతున్న డీఆర్డీవో కాన్ఫరెన్స్లో అజిత్ దోవల్ మాట్లాడారు. రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కలిపి మనకు కావాల్సిన టెక్నాలజీ గురించి అంచనా వేయాలన్నారు. మనకు అనుగుణమైన టెక్నాలజీతో భారత్ను మరింత సురక్షితంగా తయారు చేయాలన్నారు. అవసరానికి తగినట్లుగా సాంకేతికను పెంచుకోవాలన్నారు. మన లోపాలను అధిగమించే టెక్నాలజీని పొందాలని తెలిపారు. మేటి ఆయుధాలు ఉన్న ఆర్మీ ఎప్పుడూ పైచేయి సాధిస్తుందని చెప్పారు.
ఉత్తమ శ్రేణి టెక్నాలజీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, అయితే భారత్ ముందు నుంచి ఢిఫెన్స్ టెక్నాలజీలో రన్నరప్గానే ఉందని, రన్నరప్ కోసం ట్రోఫీ ఏమీ ఉండదన్నారు. ఉంటే మేటీగా ఉండాలి, లేకుంటే అలాంటిదేమీ ఉండదన్నారు. ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ, డబ్బు ప్రాంతీయ రాజకీయాలను శాసిస్తాయన్నారు. అయితే ఈ రెండు అంశాలపై పట్టు ఉన్నవాళ్లు మాత్రమే విజయం సాధిస్తారని దోవల్ తెలిపారు.
ప్రయోగశాలల్లో మాత్రమే కాకుండా సిస్టమ్స్ ఉత్పత్తిలో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవాలని చెప్పారు. వాస్తవాన్ని అంగీకరించడం కూడా చాలా ముఖ్యమని చెప్పారు. నిరంతరం ఆకళింపు చేసుకోవడం, మారుతుండటం ప్రగతిదాయకమని చెప్పారు.