ఆపరేషన్ సిందూర్ లక్ష్యం ఇదే.. ఈ రీతిలో గట్టిగా బదులిచ్చాం.. 100 మంది ఉగ్రవాదులు, 40 మంది పాక్ ఆర్మీ సిబ్బంది హతం: డీజీఎంవో
ఉగ్రవాద క్యాంపులను కచ్చితమైన ఆధారాలతో గుర్తించినట్లు వివరించారు.

Indian armed forces
ఆపరేషన్ సిందూర్పై ఢిల్లీలో ఇవాళ భారత త్రివిధ దళాల అధికారులు వివరాలు తెలిపారు. డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారద ఈ ఆపరేషన్ గురించి సమాచారాన్ని ఇచ్చారు. భారతదేశ రక్షణ సామర్థ్యాలు, మన దేశ దృఢ సంకల్పం గురించి వివరించారు. ఆపరేషన్ సిందూర్ లక్ష్యాలు, కచ్చితమైన దాడులు, ఫలితాలను వివరించారు.
ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పాలన్నదే ఆపరేషన్ సిందూర్ లక్ష్యమని రాజీవ్ ఘాయ్ అన్నారు. జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత బలమైన సమాధానం చెప్పాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సరిహద్దుకు అటువైపు ఉన్న ఉగ్రవాద క్యాంపులను కచ్చితమైన ఆధారాలతో గుర్తించినట్లు వివరించారు.
ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో భాగంగా బహావల్పూర్, మురుద్కేపై దాడులు జరిపినట్లు చెప్పారు. కచ్చితమైన లక్ష్యాలపై దాడులు చేసినట్లు వివరించారు. గగనతలం నుంచి భూతలంపై ఉన్న టార్గెట్లను ఛేదించినట్లు చెప్పారు. భారత దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అన్నారు. ఎల్వోసీ వద్ద 35-40 మంది పాక్ ఆర్మీ సిబ్బంది మృతి చెందారని తెలిపారు.
ఏకే భారతి మాట్లాడుతూ.. మే 8న జరిగిన దాడులను భారత్ తిప్పికొట్టిందని తెలిపారు. ఆ రోజున రాత్రి 10.30 గంటల నంచి భారత్లోని నగరాలపై పాకిస్థాన్ డ్రోన్లతో దాడులు చేయడానికి ప్రయత్నాలు చేసిందని అన్నారు. వాటిలోని ప్రతి డ్రోన్ను ధ్వంసం చేసినట్లు తెలిపారు.
పాక్ చేసిన దాడులను భారత రక్షణ వ్యవస్థ వెంటనే సమర్థంతంగా తిప్పికొట్టినట్లు ఏకే భారతి వివరించారు. అనంతరం పాక్ రాడార్ స్టేషన్లు. సైనిక స్థావరాలపై భారత్ తీవ్ర స్థాయిలో దాడులు చేసిందని అన్నారు. ఈ నెల 8, 9న భారత గగనతల దాడికి పాకిస్థాన్ ప్రయత్నాలు చేసిందని, వాటిని తిప్పికొట్టామని చెప్పారు.
Also Read: ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా.. ఈ షాక్ తప్పదా?