Indian Railway Board : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రైళ్లలో టికెట్ పై 25శాతం తగ్గింపు
ఏసీ సిట్టింగ్ వసతి ఉన్న రైళ్లలో రాయితీ ఛార్జీల పథకాన్ని ప్రవేశపెట్టడానికి జోనల్ రైల్వేలకు అధికారాలను అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

Indian Railway
AC Chair – Executive Class Train Fares Reduced : భారతీయ రైల్వే బోర్డు ప్రయాణికులకు తీపికబురు అందించింది. వందే భారత్ సహా అన్ని రైళ్లలో ఏసీ చైర్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీలను 25శాతం వరకు తగ్గించననున్నట్లు బోర్డు పేర్కొంది. గత 30 రోజుల్లో 50శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లలో రాయితీ ఛార్జీల పథకాన్ని ప్రవేశపెట్టాలని రైల్వే బోర్డు జోన్లకు సూచించింది. ప్రాథమిక ఛార్జీపై గరిష్టంగా 25శాతం వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది.
ఈ తగ్గింపు తక్షణమే అమలులోకి వస్తుందని వెల్లడించింది. దీంతో వందే భారత్ సహా పలు రైళ్లలోని ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ప్రయాణించే వారికి భారీ ఉపశమనం కలుగనుంది. అయితే, ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జీల తగ్గింపు నేపథ్యంలో వాపస్ ఇవ్వబడదని చెప్పింది. సెలవులు, పండుగ సమయంలో ప్రత్యేక రైళ్లలో ఈ పథకం వర్తించదని స్పష్టం చేసింది.
ఏసీ సిట్టింగ్ వసతి ఉన్న రైళ్లలో రాయితీ ఛార్జీల పథకాన్ని ప్రవేశపెట్టడానికి జోనల్ రైల్వేలకు అధికారాలను అప్పగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. విస్టాడోమ్ కోచ్ లతో సహా ఏసీ సౌకర్యం ఉన్న అన్ని రైళ్లలోని ఏసీ చైర్ కాన్, ఎగ్జిక్యూటివ్ తరగతులకు ఈ పథకం వర్తిస్తుంది. రాయితీ ప్రైమరీ ఛార్జీపై గరిష్ఠంగా 25శాతం వరకు ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఛార్జీ, సూపర్ ఫాస్ట్ సర్ ఛార్జీ, జీఎస్టీ తదితర ఛార్జీలు అదనంగా ఉంటాయి. తత్కాల్ కోటాపై రాయితీ ఉండదని, ఫస్ట్ చార్ట్ ప్రకటించే వరకు, కరెంట్ బుకింగ్ సమయంలో బుక్ చేసుకున్న టిక్కెట్లకు తగ్గింపు ఉంటుందని వెల్లడించింది. ఆన్ బోర్డ్ లో టీటీఈ ద్వారా జారీ చేసే టికెట్ సైతం డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది.