Kumaraswamy: బీజేపీ, జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటు నిజమేనా? కుమారస్వామి ఏమన్నారు?
రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ లూటీ చేస్తోందని, అందుకే బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు అవసరమని కుమారస్వామి చెప్పుకొచ్చారు.

HD Kumaraswamy
Kumaraswamy – JDS : దేశంలో మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ (BJP) సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa) సీట్ల పంపకాలపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ, జనతాదళ్ సెక్యూలర్ (JDS) పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, సీట్ల సర్దుబాటు కూడా జరిగిందని ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి స్పందించారు. యడియూరప్ప వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారని అన్నారు. బీజేపీ, జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలూ జరగలేదని వివరించారు. ఇరు పార్టీల మధ్య పొత్తుపై మాత్రం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ లూటీ చేస్తోందని, అందుకే బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు అవసరమని కుమారస్వామి చెప్పుకొచ్చారు. బీజేపీ, జేడీఎస్ మధ్య రెండు-మూడు సార్లు చర్చలు జరిగాయని తెలిపారు. ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. ప్రజల ముందుకు వచ్చి ప్రకటన చేసేముందు చర్చలు జరుపుతున్నామని అన్నారు. ప్రజలు అన్ని విషయాలనూ గమనిస్తున్నారని అన్నారు.
MLA Babu Jandel : పుట్టినరోజు నాడు దండలు వేయద్దని మెడలో పామును చుట్టుకున్న ఎమ్మెల్యే