కరోనా కష్టాలు : మహిళా ఎస్సై అత్యుత్సాహం

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ లాక్డౌన్ ప్రజల మంచికోసమే అయినా పొట్టచేత పట్టుకుని బతుకుదెరువు కోసం వచ్చిన వలస కూలీలు మాత్రం కూడు, గూడు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలావుంటే కొంత మంది పోలీసులు వారిపట్ల ప్రవర్తిస్తున్న తీరు అమానవీయంగా ఉండటంతో ఇప్పుడది చర్చనీయాంశం అవుతోంది.
ఇలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం, చత్తార్పూర్ జిల్లాలోని గొరిహార్ ఏరియాలో జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వలస కూలీ పట్ల ఒక మహిళా ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించింది. అతన్ని పట్టుకుని నడి రోడ్డుపై కూర్చోబెట్టి నుదిటిపై ‘నేను లాక్డౌన్ను ఉల్లంఘించాను, నా దగ్గరకు ఎవరూ రావొద్దు’అని పెన్నుతో రాసింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ అయ్యారు. పనిష్మెంట్ కింద మహిళా ఎస్సై అమితా అగ్నిహోత్రిని పోలీస్లైన్కు ఎటాచ్ చేశారు.