Sanjay Raut: ఇలా అయితే తెలంగాణలో కష్టమే! సీఎం కేసీఆర్పై మహారాష్ట్ర నేత సంజయ్రౌత్ సంచలన వ్యాఖ్యలు ..
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Maharashtra Politics : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) మహారాష్ట్ర (Maharashtra) పర్యటన నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఏ మాత్రం ఉండబోదని అన్నారు. కేసీఆర్ మహారాష్ట్రలోకి వచ్చి డ్రామా చేస్తున్నారు. ఇలానే నాటకాలాడితే తెలంగాణలోనూ అధికారం కోల్పోవడం ఖాయమని రౌత్ అన్నారు. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం తగ్గిపోతుంది. కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నరోజు బీఆర్ఎస్ నేతలు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరారని సంజయ్ రౌత్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీ టీం. బీజేపీనే కేసీఆర్ను మహారాష్ట్రకు పంపినట్లు అనిపిస్తోందని రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. అయినా, మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ బలంగా ఉందని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
ఇదిలాఉంటే.. బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన తరువాత కేసీఆర్ ఇతర రాష్ట్రాలపై దృష్టిసారించారు. ముఖ్యంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. తరచూ మహారాష్ట్రలో పర్యటిస్తూ, అక్కడ బహిరంగ సభల్లో పాల్గొంటూ స్థానిక ప్రజలపై హామీ వర్షం కురిపిస్తున్నారు. పనిలోపనిగా అక్కడి అధికార, విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పలు పార్టీల నుంచి కీలక నేతలు బీఆర్ఎస్లో చేరారు. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి బీ టీం అంటూ ఆరోపించారు.
CM KCR : సమైక్యవాదులు నాపై లెక్కలేనన్ని దాడులు చేశారు, నన్ను భయపెట్టారు- సీఎం కేసీఆర్
తాజాగా రెండు రోజులుగా సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. దాదాపు 600 వాహనాల కాన్వాయ్తో హైదరాబాద్ నుంచి సోమవారం సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లారు. సోలాపుర్ వద్ద కేసీఆర్కు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. మంగళవారం రెండోరోజు సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. పండరీపురంలోని శ్రీ విఠల్ రుక్మిణి దేవస్థానాన్ని కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు సందర్శించారు. అక్కడ విఠలేశ్వరుడి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే, కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సమయంలోనే సంజయ్ రౌత్ కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై విమర్శలు గుప్పించారు.