ఎన్నికల వేళ భారత్ ఎటువైపు? దేశంలోని ప్రధాన నేతలు, వారి మైనస్ పాయింట్లు ఇవే..
Lok Sabha elections 2024: శారదా కుంభకోణం, టీచర్ల నియామకాల్లో అవినీతి వంటి అంశాలు అమెను వెంటాడుతున్నాయి.
తిరుగులేని నేతగా ఉన్న ప్రధాని మోదీని..ఎదురిస్తూ.. తమకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంటున్నారు పలువురు నేతలు. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి కేంద్రప్రభుత్వం విధానాలపై పోరాడుతూ వస్తున్నారు అపోజిషన్ లీడర్లు.
ప్రధాని నరేంద్రమోదీ, బలమైన బీజేపీని ఢీకొంటూ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు మమతా బెనర్జీ. బీజేపీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిలో చేరిన మమత సీట్ల పంపకాల్లో కాంగ్రెస్తో పొత్తు కుదరక 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. బెంగాల్లో బలపడుతోన్న బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రచారం చేస్తున్నారు.
అయితే సందేశ్ఖాలీ వ్యవహారం ఆమెకు తలనొప్పిగా మారింది. సందేశ్ఖాలీ ఇష్యూను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో.. షాజహాన్ షేక్ను పార్టీ నుంచి బహిష్కరించింది. శారదా కుంభకోణం, టీచర్ల నియామకాల్లో అవినీతి వంటి అంశాలు అమెను వెంటాడుతున్నాయి.
నితీశ్ కుమార్
జాతీయస్థాయిలో ప్రతిపక్షాలు కూటమి కట్టడం వెనక కీలక పాత్ర పోషించారు జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్. అయితే కరెక్ట్గా లోక్సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి హ్యాండిచ్చి.. ఎన్డీయే కూటమిలో చేరారు. దీంతో 40 లోక్సభ స్థానాలున్న బిహార్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.
శరద్ పవార్
మహారాష్ట్ర రాజకీయాలలో సీనియర్ నేతగా, NCPని జాతీయ పార్టీగా మార్చిన శరద్ పవార్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో బలమైన నేతగా ఉన్నారు. NDAకూటమికి మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ నుంచి గట్టి పోటీనే ఎదురుకానుంది. మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, శివసేన-ఉద్ధవ్ ఠాక్రే వర్గం, NCP-శరద్ పవార్ పార్టీలు ఉన్నాయి. అయితే అజిత్ పవార్ కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి NDAలో చేరడంతో శరద్ పవార్ బలగం తగ్గిపోయింది.
NCP పార్టీ పేరు, గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గానికే కేటాయించింది. ఇప్పుడు శరద్ పవార్ కొత్త గుర్తును, పేరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్నారు. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ ఇండియా కూటమిలో ఉన్న మరో బలమైన నేత. 39 స్థానాలున్న తమిళనాడులో 2019లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి 38 స్థానాల్లో విజయం సాధించింది.
స్టాలిన్
ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని స్టాలిన్ పట్టుదలగా ఉన్నారు. అయితే సనాతన ధర్మంపై ఉదయ్నిధి స్టాలిన్ వ్యాఖ్యలు, డీఎంకే కేబినెట్ మంత్రులపై అవినీతి ఆరోపణలు, తమిళనాడులో బీజేపీ ఎదుగుదల.. ఆ రాష్ట్రంలో ఇండియా కూటమికి ఇబ్బందికరంగా మారాయి.
ఏపీ సీఎం వైఎస్ జగన్ అటు ఎన్డీయేకు.. ఇటు ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నారు. సింగిల్గా ఎన్నికలను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. 2019లో 151 సీట్లు సాధించి ప్రభంజనం సృష్టించిన జగన్.. ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. అయినా తగ్గకుండా తానిచ్చిన సంక్షేమ పథకాలనే నమ్ముకుని.. 175 సీట్లే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు జగన్.
తేజస్వీ యాదవ్
లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన తేజస్వీ యాదవ్ కూడా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. 2020లో తేజస్వీ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లిన ఆర్జేడీ 75 స్థానాలను గెల్చుకుని ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. నితీశ్ కుమార్ ఆర్డేడీ, కాంగ్రెస్తో చేతులు కలపడంతో కూటమి అధికారంలోకి వచ్చింది.
అప్పుడు నితీశ్ కేబినెట్లో తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కూటమి నుంచి నితీశ్ కుమార్ తప్పుకోవడంతో తేజస్వీ యాదవ్ మళ్లీ ప్రతిపక్ష నాయకుడిగా మారారు. ప్రజలతో మంచి సంబంధాలున్న తేజస్వీ ఈ ఎన్నికల్లో మెజార్టీ లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని కసిగా ఉన్నారు.
కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్.. బీజేపీకి కంట్లో నలుసులా తయారయ్యారు. ఢిల్లీలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్.. బీజేపీకి సవాల్గా మారారు. ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు.. ఆప్ను జాతీయ పార్టీగా మార్చి వివిధ రాష్ట్రాల్లో విస్తరించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంతో పాటు పలు కేసుల్లో ఈడీ నోటీసులు..కేబినెట్ మంత్రులు, ఆప్ నేతలపై ఆరోపణలు కేజ్రీవాల్ కు ఇబ్బందికరంగా మారాయి.
అసద్దుదీన్
ఎంఐఎం చీఫ్ అసద్దుదీన్ ఓవైసీ..పలు లోక్సభ స్థానాల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తారు. యూపీ, బిహార్, మహారాష్ట్రలో ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల ఆయన ఓట్లను చీల్చే అవకాశం ఉంది. సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓవైసీ ఆ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొందరిది అధికారి పక్షమైతే..మరికొందరిది ప్రతిపక్షం. ప్రశ్నించే గొంతులుగా అపోజిషన్ లీడర్లు ప్రజల్లోకి వెళ్తుంటే.. అభివృద్ధి పేరుతో అధికారంలో ఉన్న నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వైసీపీ ప్రచార వ్యూహం.. సింగిల్గా, పక్కా ప్రణాళికతో జనాల్లోకి జగన్