ఊచలు లెక్కపెట్టించారు : బిచ్చగాడిగా మోడీ ఫొటో

ప్రధాని నరేంద్రమోడీని కించపరుస్తూ ఫొటోలను మార్ఫ్ చేసిన తమిళనాడు MDMK పార్టీ నేతను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదివారం (జనవరి 27, 2019) ప్రధాని మోడీ మధురైలో ఎయిమ్స్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. సోషల్ మీడియాలో గో బ్యాక్ మోడీ నినాదాలతో పొలిటికల్ హై టెన్షన్ కొనసాగిన విషయం తెలిసిందే. మోడీ రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకంగా MDMK చీఫ్ వైగో ఆందోళన చేపట్టారు. గో బ్యాక్ మోడీ నినాదాలతో ఉన్న బ్లాక్ బెలూన్స్ ని గాల్లోకి వదిలారు.
మోడీ తమిళనాడు పర్యటనను వ్యతిరేకిస్తూ MDMK నేత ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఓ మార్ఫింగ్ ఫొటో వివాదాస్పదమైంది. ఆ ఫొటోలో ప్రధాని నరేంద్రమోడీ ఓ బిచ్చగాడిలా ఉంటారు. చేతిలో చిప్పపట్టుకుని ఇంటింటికి తిరుగుతూ అడుక్కొంటున్నట్లు ఉంది. చేతికి వాచ్ ధరించి.. మెడలో సంచీలను ధరించి కళ్లద్దాలు పెట్టుకున్న మోడీ.. చిప్పపట్టుకుని ఉన్న ఫొటోను MDMK నేత ఎస్ కేబీ బాలు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.
దీనిపై తమిళనాడు బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధానమంత్రిపైనే ఇలాంటి వ్యగ్యాస్త్రం, వెటకారాలు ఆడినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. అతడిని అరెస్ట్ చేశారు. జైలుకి తరలించారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దు ఉంటుందని తెలిపారు. పరిధి దాటితే అరెస్ట్ తప్పదని హెచ్చరించారు. మోడీని బిచ్చగాడిగా మార్ఫింగ్ చేసిన ఫొటోపై సీరియస్ అయ్యారు బీజేపీ కార్యకర్తలు కూడా…