బెంగాల్ ఎన్నికలు : మిథున్ కి హ్యాండిచ్చిన బీజేపీ..తుది జాబితాలో దక్కని చోటు

ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఈ నెల ప్రారంభంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

బెంగాల్ ఎన్నికలు : మిథున్ కి హ్యాండిచ్చిన బీజేపీ..తుది జాబితాలో దక్కని చోటు

Mithun Chakraborty

Updated On : March 23, 2021 / 8:58 PM IST

Mithun Chakraborty    ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఈ నెల ప్రారంభంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌ గా ఉన్న మిధున్ చక్రవర్తికి కాషాయ పార్టీ మంగళవారం విడుదల చేసిన తుదిజాబితాలో చోటు దక్కలేదు. మంగళవారం 13 మంది పేర్లతో బీజేపీ విడుదల చేసిన తుది జాబితాలో మిథున్ చక్రవర్తి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రష్‌బెహరి సీటు నుంచి మిధున్ చక్రవర్తిని బీజేపీ బరిలో దింపుతుందని భావించినా..ఈ స్ధానం నుంచి ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడ్డ క్లిష్ట పరిస్థితుల్లో కశ్మీర్‌ ఇంచార్జీగా పని చేసిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతా సాహాని అభ్యర్ధిత్వాన్ని బీజేపీ ఖరరారు చేసింది.

ఇక, తుది జాబితాలో సైతం మిధున్ చక్రవర్తి పేరు లేకపోవడం ఆయన అభిమానులను నిరాశపరిచింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల తన ఓటు హక్కును ముంబై నుంచి మిథున్ చక్రవర్తి కోల్ కతాకి బదిలీ చేసుకున్న విషయం తెలిసిందే. ఒక దశలో మిథున్‌ను బీజేపీ బెంగాల్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. సీఎం అభ్యర్థి విషయం పక్కనబెడితే కనీసం ఆయనకు అసెంబ్లీ టిక్కెట్ కూడా దక్కలేదు. మరోవైపు చివరి నిమిషంలో ప్రస్తుత అభ్యర్దిని మార్చి మిధున్‌ చక్రవర్తిని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బీజేపీ బరిలో దించే అవకాశాలూ తోసిపుచ్చలేమని పరిశీలకులు పేర్కొంటున్నారు.

కాగా, మార్చి 7న కోల్‌కతాలోని బ్రిగేడ్ పెరేడ్ మైదానంలో బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీతో కలిసి సభా వేదికను మిథున్ చక్రవర్తి పంచుకున్నారు. ఈ సభలో బాలీవుడ్ నటుడు చెప్పిన బెంగాలీ సినిమాలోని ‘నిన్ను ఇక్కడ కొట్టానంటే నీ బాడీ వెళ్లి స్మశానంలో పడతుంది’’ అనే డైలాగ్ అక్కడి వారందిరిని అమితంగా ఆకట్టుకుంది. ‘నేను హానిచేయని నీటి పాము, ఎడారి పామును కాదు.. నేను కోబ్రాను.. ఒక్కసారి దాడిచేస్తే నీ ఫోటో గోడకు వేలాడుతుంది’ అనే డైలాగ్ కూడా చెప్పి ఉత్సాహపరిచారు.

ఇక,294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది. మే 2న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.