వెయ్యి రూపాయలు వేశారు : మంత్రి గడ్కరీకి ఓవర్ స్పీడ్ ఫైన్

కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లో భాగంగా… భారీ జరిమానాలతో ప్రజల జేబులు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. దీంతో ప్రజలు వెహికల్ తో రోడ్ పైకి రావాలంటనే భయపడుతున్నారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు కూడా ప్రజల నుంచి వెల్లువెత్తున్నాయి. ప్రజల క్షేమాన్ని దృష్టి పెట్టుకునే ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నామని..కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సమర్థించుకున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే..ఎవరికైనా జరిమానాలు తప్పవనీ..చట్టం దృష్టిలో ఎవర్వరైనా ఒక్కటేననీ..మంత్రినైన తన కారుకు కూడా పోలీసులు ఫైన్ వేశారని మంత్రి తెలిపారు. ముంబైలో తన పేరున ఉన్న కారు ఓవర్ స్పీడ్ తో వెళ్లినందుకు తన కారుకు కూడా ఫైన్ వేశారని ముంబైలో సోమవారం (సెప్టెంబర్ 9)న జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.
కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం.. మితి మీరిన వేగం(ఓవర్ స్పీడ్) వెహికల్స్కు వెయ్యి నుంచి 2వేల వరకూ ఫైన్ పడుతుందని సూచించారు. మరి గడ్కరీ కారు వేగంగా వెళ్లినందుకు ఫైన్ కట్టారంటే వెయ్యి రూపాయలు చెల్లించి ఉండాలి. ఆటో నడుపుకునే వ్యక్తి రూ.53వేలు, స్కూటీ నడిపే వ్యక్తి రూ.23వేలు ఫైన్లు కట్టలేక వాపోతుంటే అంతటి స్థాయి వ్యక్తి వెయ్యి ఫైన్ కట్టానని చెప్తుంటే నోరెళ్లబెట్టి చూస్తున్నారు ప్రజలు.
రోడ్డు భద్రతను పెంచేందుకు జాతీయ హైవేలపై 786 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లుగా ఆయన తెలిపారు. సుమారు 30 శాతం డ్రైవింగ్ లైసెన్సులు బోగస్ వే ఉన్నాయన్నారు. భారీగా జరిమానాలు విధించడం వల్ల అవినీతి చోటుచేసుకుంటుందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. తీవ్రంగా ఖండించారు. అన్ని ప్రాంతాల్లోను కెమెరాల నిఘాను ఏర్పాటు చేశామని అటువంటప్పుడు అవినీతి ఎలా జరుగుతుందని మంత్రి ప్రశ్నించారు. కాబట్టి ప్రజలు డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలంటే నిబంధల్ని అనుసరించి వ్యవహరించాలని మంత్రి సూచించారు.