సీఎంగా 9వ సారి నితీశ్ ప్రమాణం.. గతంలోనూ ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేశారో తెలుసా? బిహార్ రాజకీయాల్లో ఏం జరిగింది?
నితీశ్ సహా 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
బిహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. నితీశ్ సహా 8 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి(డిప్యూటీ సీఎం), విజయకుమార్ సిన్హా(డిప్యూటీ సీఎం), డా.ప్రేమ్ కుమార్(మంత్రి) ప్రమాణ స్వీకారం చేశారు.
అలాగే, విజయ్ కుమార్ చౌదరి, శ్రవణ్ కుమార్(జేడీయూ), విజయేంద్ర ప్రసాద్ యాదవ్ (జేడీయూ), సంతోష్ కుమార్ సుమన్(హెచ్ఏఎం), సుమిత్ కుమార్ (స్వతంత్ర ఎమ్మెల్యే) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
బిహార్ సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది తొమ్మిదోసారి.
గతంలో సీఎంగా ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేశారో తెలుసా?
- 2000 మార్చి
- 2005 నవంబరు
- 2010 నవంబరు
- 2015 ఫిబ్రవరి
- 2015 నవంబరు
- 2017 జులై
- 2020 నవంబరు
- 2022 ఆగస్టు
అందుకే కోపం..
నితీశ్ కుమార్ 2022లో బీజేపీకి దూరం జరిగి… ఆర్జేడీ, కాంగ్రెస్ సహకారంతో బిహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో చురుగ్గానే పాల్గొన్నారు. కాంగ్రెస్తో సత్సంబంధాలు కొనసాగించారు. ఇండియా కూటమిలోనూ కీలకపాత్ర పోషించారు. అయితే.. ఇటీవల జరిగిన ఇండియా సమావేశంలో కూటమి కన్వీనర్గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించడం నితీశ్కు కోపం తెప్పించింది.
ఇది కొనసాగుతుండగానే…కన్వీనర్గా ఉండేందుకు ఖర్గే నిరాకరించడంతో… కూటమి కన్వీనర్గా…సీతారామ్ ఏచూరీ… నితీశ్కుమార్ పేరును ప్రతిపాదించారు. లాలూ, శరద్ పవార్ వంటి నేతలంతా ఈ ప్రతిపాదనపై సానుకూలంగా ఉండగా…రాహుల్ గాంధీ మాత్రం మమతాబెనర్జీ పేరు ప్రకటించారు.
కూటమి కన్వీనర్గా తనను కాదని మమత పేరు ప్రకటించడం నితీశ్కు మరింత కోపం తెప్పించింది. అలాగే బీహార్లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇది కూడా నితీశ్ ఆగ్రహానికి ఓ కారణమైంది. ఈ క్రమంలోనే రాహుల్గాంధీ బీహార్లో చేపట్టనున్న న్యాయ్ యాత్రకు హాజరుకానని ప్రకటించారు నితీశ్. దీంతో జేడీయూ ఇండియా కూటమి నుంచి తప్పుకుంటుందన్న వార్తలకు బలం చేకూరింది.
మరోవైపు.. లాలూప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీపైనా కొంతకాలంగా నితీశ్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. జేడీయూలోని మంత్రులను ఆర్జేడీ నేతలు విమర్శించడం, ఆర్జేడీకి చెందిన పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండానే పలు నిర్ణయాలు తీసుకోవడంపై నితీశ్ ఆగ్రహంతో ఉన్నారు. దీనికితోడు.. జేడీయూకు తక్కువ సీట్లు ఉన్నాయని..అందుకే నితీశ్ తప్పుకొని.. తేజస్వి యాదవ్కు సీఎం పదవి అప్పగించాలని ఆర్జేడీ నేతలు వ్యాఖ్యానించడం ప్రారంభించారు. ఇది నితీశ్ను ఆలోచనలో పడేసిందని జేడీయూ నేతలు చెబుతున్నారు.