భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య తేడా ఏమీ లేదు: మెహబూబా ముఫ్తీ కామెంట్ల దుమారం

ఆదివారం జమ్మూలో పీడీపీ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య తేడా ఏమీ లేదు: మెహబూబా ముఫ్తీ కామెంట్ల దుమారం

Updated On : December 1, 2024 / 9:26 PM IST

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భారత్‌లోని పరిస్థితులను బంగ్లాదేశ్‌లోని పరిస్థితులతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, భారత్‌లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు.

మరి భారత్‌కు, బంగ్లాదేశ్‌కు తేడా ఏంటని ఆమె ప్రశ్నించారు. భారత్‌కు బంగ్లాదేశ్‌కు మధ్య తనకు ఎలాంటి తేడా కనిపించడం లేదని ముఫ్తీ అన్నారు. ఆదివారం జమ్మూలో పీడీపీ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే, హిందూ మత నాయకుడు చిన్మోయ్‌ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌లో అరెస్ట్ చేశారు. ఇటువంటి సమయంలో ఆ దేశాన్ని భారత్‌తో పోల్చడం పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

బంగ్లాదేశ్‌లోని పరిస్థితిని భారత్‌లోని పరిస్థితులతో పోల్చుతూ మెహబూబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తున్నామని జమ్మూకశ్మీర్‌ బీజేపీ మాజీ చీఫ్ రవీందర్ రైనా అన్నారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి ప్రపంచానికి తెలుసని తెలిపారు.

బంగ్లాదేశ్‌లో మైనారిటీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, మహిళలను అవమానపర్చుతున్నారని అన్నారు. అలాగే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని (హసీనా) దేశం విడిచి పారిపోవాల్సి వచ్చిందని చెప్పారు. మెహబూబా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, ఆమె కుట్రలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ముఫ్తీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Priyanka Gandhi: ఆ శక్తికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం: ప్రియాంకా గాంధీ