‘మిస్టర్ ట్రంప్.. ఆ విషయంలో మీ జోక్యం లేదు, ఉండదు, ఉండబోదు‘.. ఫోన్ లో ట్రంప్ కి తెగేసి చెప్పిన ప్రధాని మోదీ..
డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడుకున్నారు. వీరి మధ్య 35 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ సాగింది.

Donald Trump Narendra Modi
గత నెలలో భారతదేశం – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని.. వాణిజ్యాన్ని నిలిపివేస్తామని బెదిరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఆపవలసి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే పేర్కొన్నారు. తాజాగా.. ఆ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. ఈ మేరకు ట్రంప్ నకు బిగ్ షాకిచ్చారు.
జీ-7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీ భేటీ జరగాల్సి ఉంది. అయితే, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పర్యటనను కుదించుకుని ట్రంప్ వెళ్లిపోయారు. ఈ తరుణంలో ఇరు దేశాల అధినేతలు డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీలు ఫోన్ లో మాట్లాడుకున్నారు. వారి మధ్య ఫోన్ కాల్ సంభాషణ సారాంశాన్ని కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరించారు.
విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య 35 నిమిషాల పాటు సంభాషణ జరిగిందని చెప్పారు. ‘‘ పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల సమయంలో భారత్-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్-పాకిస్థాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశంపైనా చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్-పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాకిస్థాన్ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా చెప్పారు.’’ అని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.
కెనడా పర్యటన ముగించుకొని వెళ్లే సమయంలో అమెరికాకు రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించారని.. కానీ, షెడ్యూల్ ప్రకారం తాను రాలేనని నరేంద్ర మోదీ ట్రంప్ కు వివరించినట్లు మిస్రీ తెలిపారు. త్వరలోనే ద్వైపాక్షికంగా భేటీ కావాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించుకున్నారని మిస్రీ చెప్పారు. భారత్ లో జరిగే క్వాడ్ తదుపరి సమావేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ ను ఆహ్వానించారని, అందుకు ట్రంప్ అంగీకరించారని, భారత్ పర్యటనకు వచ్చేందుకు ఉత్సకతతో ఉన్నానని ట్రంప్ చెప్పారని మిస్రీ వివరించారు.