లడఖ్ మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన మాథుర్

లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా రాధాకృష్ణ మాథుర్ ఇవాళ(అక్టోబర్-31,2019) ప్రమాణ స్వీకారం చేశారు. జమ్మూకశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గీతా మిట్టల్ .. మాథుర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. లేహ్, కార్గిల్కు చెందిన అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్మీ, పారామిలిటరీ దళాలు, మతపెద్దలు, సాధారణ ప్రజలు కూడా కార్యక్రమానికి వచ్చారు. ప్రమాణ స్వీకార సమయంలో లడఖ్ పోలీసులు.. లెఫ్టినెంట్ గవర్నర్ మాథుర్కు గౌరవ వందనం ఇచ్చారు.
కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన లడఖ్కు లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తిగా మాథుర్ నిలిచారు. రాధాకృష్ణ మథుర్.. త్రిపుర కేడర్ కు చెందిన 1977 బ్యాచ్ IAS ఆఫీసర్. త్రిపుర చీఫ్ సెక్రటరీగా మథుర్ పనిచేశారు. ఢిఫెన్స్ సెక్రటరీగా కూడా ఆయన పనిచేశారు. 2018లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CIC)నుంచి రిటైర్ట్ అయ్యారు.
గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాథుర్ మాట్లాడుతూ…లడఖ్ ప్రాంతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. అభివృద్ధి మిశ్రమమైనది, అన్ని రంగాలలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అభివృద్ధి ప్యాకేజీ తయారు చేయబడుతుంది. విద్య,ఆరోగ్యం ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. అక్టోబర్ -25,2019న జమ్మూకశ్మీర్,లఢఖ్, మిజోరాంలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. లఢఖ్ లెఫ్టెనెంట్ గవర్నర్ గా శ్రీ రాధాకృష్ణ మథుర్ ని నియమించారు. మిజోరాంమ్కు గవర్నర్ గా శ్రీధరన్ పిళ్లైని నియమించారు.
ఈ ఏడాది ఆగస్టు-5,2019న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా,లఢఖ్ ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా పునర్విభజన చేశారు. ఇవాళ(అక్టోబర్-31,2019)నుంచి జమ్మూకశ్మీర్,లఢఖ్ ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా అధికారంగా అమలులోకి వచ్చాయి.