శనివారం తమిళనాడులో రాహుల్ ప్రచార శంఖారావం

rahul gandhi: ఏప్రిల్-మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని కాంగ్రెస్ ప్రారంభించనుంది. రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి తెలిపారు. కాగా ఈ నెల 14న మధురైలో జరిగిన జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొనేందుకు తమిళనాడుకు రాహల్ వెళ్లిన విషయం తెలిసిందే.
జనవరి 23న కోయంబత్తూర్, త్రిస్సూర్ జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని… ఈరోడ్లో జరిగే సభకు హాజరయ్యేందుకు కూడా రాహుల్ అంగీకరించారని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు అళగిరి ఇవాళ తెలిపారు. జనవరి-25వరకు రాహుల్ తమిళనాడులో ఉంటారన్నారు. ఇక,లోక్ సభ ఎన్నికల్లో మాదిరిగానే త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకేతో పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తమతో చేరాలనుకుంటే స్వాగతం పలుకుతామని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమని అళగిరి ధీమా వ్యక్తం చేశారు. విధానాల పరంగా డీఎంకేతో కొన్ని అంతరాలు ఉన్నప్పటికీ లౌకికవాదానికి తామంతా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తమ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నీట్ పరీక్షను రద్దు చేస్తామని చెప్పారు. విద్య, వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు.