RBI New Policy : అమలులోకి నూతన విధానం.. స‌రిప‌డా బ్యాలెన్స్ ఉంటేనే చెక్ జారీ చేయండి!

ఈ ఏడాది జనవరిలో ఆర్బీఐ పాజిటివ్‌ పే వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ విధానంలో రూ.50వేలు, అంత‌కంటే ఎక్కువ విలువైన చెక్కు లావాదేవీలను మ‌రింత సుర‌క్షితంగా నిర్వ‌హించేందుకు చెక్ వివ‌రాల‌ను రీ-క‌న్ఫ‌ర్మేష‌న్ చేయాల‌ని సూచించింది. ఈ ప్ర‌క్రియ‌లో చెక్కు జారీ చేసిన వారు చెక్ నంబ‌రు, చెక్ తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబ‌రు, అమౌంట్ త‌దిత‌ర వివ‌రాల‌ను సంబంధిత బ్యాంకు అధికారుల‌కు ఎల‌క్ట్రానిక్‌ ప‌ద్ధ‌తిలో తెలియ‌జేసి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

RBI New Policy : అమలులోకి నూతన విధానం.. స‌రిప‌డా బ్యాలెన్స్ ఉంటేనే చెక్ జారీ చేయండి!

Rbi New Policy

Updated On : August 5, 2021 / 9:48 PM IST

RBI New Policy : కాలం మారిపోతుంది, టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. అయితే కొన్ని ప్రభుత్వ సంస్థలు టెక్నాలజీకి ఆమడ దూరంలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని సంస్థలు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాయి. ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్నిటికంటే ప్రధానమైనది బ్యాంకింగ్ రంగం. బ్యాంకులు ఒక్కరోజు పనిచేయకపోతే కోట్లలో లావాదేవీలు నిలిచిపోతాయి. ఇక బ్యాంకు సెలవు ఉందంటే ఒకరోజు ముందే బ్యాంకువద్ద క్యూ కడతారు. అయితే ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా ఆర్బీఐ నూతన విధానాలకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జనవరిలో ఆర్బీఐ పాజిటివ్‌ పే వ్యవస్థను తీసుకొచ్చింది.

ఈ విధానంలో రూ.50వేలు, అంత‌కంటే ఎక్కువ విలువైన చెక్కు లావాదేవీలను మ‌రింత సుర‌క్షితంగా నిర్వ‌హించేందుకు చెక్ వివ‌రాల‌ను రీ-క‌న్ఫ‌ర్మేష‌న్ చేయాల‌ని సూచించింది. ఈ ప్ర‌క్రియ‌లో చెక్కు జారీ చేసిన వారు చెక్ నంబ‌రు, చెక్ తేదీ, చెల్లింపుదారుడి పేరు, ఖాతా నంబ‌రు, అమౌంట్ త‌దిత‌ర వివ‌రాల‌ను సంబంధిత బ్యాంకు అధికారుల‌కు ఎల‌క్ట్రానిక్‌ ప‌ద్ధ‌తిలో తెలియ‌జేసి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇలా నిర్ధారణ చేస్తేనే చెక్కు ఎవరిపేరు మీద ఇష్యూ అయిందో వారికి ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది. ఈ విధానం వలన మోసాలను అరికట్టవచ్చు.. గతంలోలా ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకి చెక్కులు క్రాస్ చెక్ కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదు. మొత్తం ఆన్లైన్ లోనే జరిగిపోతుంది.

ఈ మేరకు బ్యాంకింగ్ నియ‌మాల్లో ఆర్‌బీఐ కొన్ని మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ ఆగ‌స్టు 1 నుంచి అమ‌ల్లోకి వచ్చాయి. ఇందులో భాగంగా బ‌ల్క్ క్లియ‌రింగ్‌ను 24 గంట‌లూ అందుబాటులో ఉంచాల‌ని ఆర్‌బీఐ నిర్ణ‌యించింది. నేష‌న‌ల్ ఆటోమెటెడ్ క్లియ‌రింగ్ హౌస్‌ (NACH-నాచ్‌) ఈ నెల నుంచి 24 గంట‌లూ ప‌నిచేస్తుంది. ఈ నిర్ణయంతో సెల‌వు దినాల్లో కూడా చెక్ క్లియ‌రింగ్‌కు వెళ్లి క్యాష్ చేసుకునే వీలుంటుంది. సెల‌వు కదా అని నిర్లక్ష్యంగా ఖాతాలో సరిపడా నగదు లేకుండా చెక్ ఇవ్వ‌కూడ‌దు. చెక్‌ ఇచ్చే ముందు తగినంత బ్యాలెన్స్‌ ఉందో లేదో చూసుకుని ఇవ్వడం ముఖ్యం. లేదంటే చెక్ బౌన్స్ అయ్యే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ చెక్ బౌన్స్ అయితే పెనాల్టీ చెల్లించాల్సి వ‌స్తుంది.

నాచ్ అంటే ఏంటి?

నాచ్‌ అనేది బ‌ల్క్ పేమెంట్ సిస్ట‌మ్‌. దీన్ని నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్వ‌హిస్తుంది. డివిడెంట్‌, వ‌డ్డీ, జీతం, పెన్ష‌న్ వంటి క్రెడిట్ బ‌దిలీల‌ను ఒక‌రి నుంచి అనేక మందికి ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డాన్ని సుల‌భ‌త‌రం చేస్తుంది. ఒకటవ తేదీ బ్యాంకులకు సెలవు ఉన్నా.. జీతాలు ఉద్యోగుల అకౌంట్ లోకి క్రిడెట్ అవుతాయి. విద్యుత్‌, గ్యాస్‌, టెలిఫోన్‌, వాట‌ర్ బిల్లులు, రుణాల‌కు సంబంధించి క్ర‌మానుగ‌త వాయిదాలు, మ్యూచువ‌ల్ ఫండ్స్ పెట్టుబ‌డులు, బీమా ప్రీమియంలు మొద‌లైన‌వి సుల‌భంగా సేకరించవచ్చు.. చెల్లింపులు చేయవచ్చు.