Goa: గోవాకు తీసుకెళ్తానని చెప్పడంతో ఎగిరి గంతులేసిన భార్య.. చివరకు ఆమెను భర్త ఎక్కడికి తీసుకెళ్లాడో తెలుసా?
గోవాకు వెళ్దామని భార్యకు చెప్పాడు. దీంతో ఆమె సంబరపడిపోయింది. గోవాలో బాగా ఎంజాయ్ చేద్దామని అనుకుంది.

goa
హనీమూన్కి గోవా తీసుకెళ్తానని చెప్పి భార్యను అయోధ్యకు తీసుకెళ్లాడు ఓ భర్త. దీంతో తనకు విడాకులు కావాలంటూ కోర్టుకు వెళ్లింది భార్య. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకుంది. విడాకుల కోసం ఆ భార్య ఇప్పటికే ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.
ప్రస్తుతం ఆ కొత్త జంటకు అధికారులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలర్ షాలీ అవస్థీ చెప్పిన వివరాల ప్రకారం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఓ యువకుడికి గత ఏడాది ఆగస్టులో ఓ అమ్మాయితో పెళ్లి జరిగింది. హనీమూన్కు తీసుకెళ్లాలని తన భర్తను ఆమె చాలా రోజుల నుంచి అడుగుతోంది.
అయితే, తన తల్లిదండ్రులు దేశంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించాలనుకుంటున్నారని మొదట వారిని ఆయా ప్రదేశాలకు తీసుకెళ్లాలని చెప్పాడు. చివరకు, గోవాకు వెళ్దామని భార్యకు చెప్పాడు. దీంతో ఆమె సంబరపడిపోయింది. గోవాలో ఎంజాయ్ చేద్దామని అనుకుంది. అయితే, ప్రయాణానికి ఒక్క రోజు ముందు ఆమె ఆశలపై నీరు చల్లాడు ఆ భర్త.
తల్లి కోరిక మేరకు అయోధ్య, వారణాసికే వెళ్తున్నామని భార్యతో అన్నాడు. ఇష్టం లేకుండానే ఆయా ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి వచ్చింది ఆ యువతి. ఇంటికి వచ్చాక భర్తతో గొడవ పెట్టుకుంది. తనను గోవాకు తీసుకెళ్తానని చెప్పి, అయోధ్యకు ఎందుకు తీసుకెళ్లావని నిలదీసింది. పెళ్లయినప్పటి నుంచి తన భర్త ఆయన తల్లిదండ్రులకే ప్రాధాన్యం ఇస్తున్నాడని ఆమె వాపోయింది. చివరకు విడాకుల కోసం కోర్టుకు వెళ్లింది.