ఢిల్లీని వీడుతున్న సోనియా గాంధీ

Sonia Gandhi advised to leave Delhi due to pollution కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీని వీడనున్నారు. దేశరాజధానిలో వాయుకాలుష్యం భారీగా పెరిగిన నేపథ్యంలో దీర్ఘకాలిక ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సోనియాగాంధీ కొన్ని రోజులపాటు నగరానికి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఆమె కొద్ది రోజుల పాటు చెన్నై లేదా గోవాకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ రోజు సాయంత్రంలోపే ఆమె ఢిల్లీని వీడనున్నారని.. ఆమెతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలలో ఎవరో ఒకరు ఉంటారని పార్టీ వర్గాల సమాచారం.
కాగా, ఈ ఏడాది ఆగస్టులో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటీ నుంచి సోనియా గాంధీ ఎక్కువగా మందులు వాడుతూనే ఉన్నారు. ఛాతీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న సోనియా గాంధీ కొంతకాలంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుకాకపోవడంపై డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలో నెలకొన్న కాలుష్యం ఆమె ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు.
సోనియా గాంధీ జూలై 30వ తేదీ సాయంత్రం అనారోగ్యంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సెప్టెంబర్ 12న సాధారణ వైద్య పరీక్షలు కోసం ఆమె అమెరికా వెళ్లారు. ఆ పర్యటనలో ఆమెతో పాటు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఈ కారణంగా సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలను సోనియా, రాహుల్లు హాజరుకాలేదు.
మరోవైపు, ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనపై ఆత్మపరిశీలన కోసం పార్టీలోని కొందరు నేతలు డిమాండ్ చేస్తున్న తరుణంలో సోనియా గాంధీ ఢిల్లీని వీడి వెళుతున్నారు. ఈ డిమాండ్ చేస్తున్నవారిలో కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులను కోరుతూ ఆమెకు లేఖ రాసిన కొందరు నేతలు కూడా ఉన్నారు.