Sonia Gandhi : దూకుడు పెంచిన కాంగ్రెస్..విపక్ష నేతలతో సోనియా సమావేశం!
కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి మోదీ సర్కార్ పై పొలిటికల్ ఎటాక్ కి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
Sonia Gandhi కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి మోదీ సర్కార్ పై పొలిటికల్ ఎటాక్ కి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ పై సమైక్యంగా గళమెత్తిన తరహాలోనే విపక్షాలను కార్యోన్ముఖం చేసేలా విందు భేటీలను కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.పెగాసస్, వ్యవసాయ చట్టాల వంటి అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో మోదీ సర్కార్ ను ఇరుకునపెట్టేలా వ్యవహరించేలా విపక్షాలను కోరుతూ గతవారం రాహుల్ గాంధీ విపక్ష నేతలకు బ్రేక్ఫాస్ట్ విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల చేపడుతున్న నిరసన ప్రదర్శనల్లో కూడా రాహుల్ పాల్గొంటూ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా రంగంలోకి దిగింది. మోదీ సర్కార్ను దీటుగా ఎదుర్కొనేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా సోనియా గాంధీ ఓ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 20న విపక్ష నేతలతో సోనియా గాంధీ వర్చువల్ గా సమావేశం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్,తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్,ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలువరు విఫక్ష నేతలకు సోనియాగాంధీ మీటింగ్ లో పాల్గొనాలని కాంగ్రెస్ నుంచి ఆహ్వానాలు అందాయి. త్వరలో విపక్ష నేతలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విందు సమావేశం కూడా ఏర్పాటు చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక,సోనియా గాంధీ ఈ నెల 20న నిర్వహించే సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పాల్గొంటారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ సమైక్యంగా ఉన్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పారు.
READ: Rahul Gandhi : పాకిస్తాన్ బోర్డర్ లా పార్లమెంట్.. ఇది ప్రజాస్వామ్య హత్యే.. విపక్షాల నిరసన ప్రదర్శన